కారునే ఇల్లుగా మార్చుకున్న వైద్యులు.. సీఎం ప్రశంసలు

ABN , First Publish Date - 2020-04-10T03:12:48+05:30 IST

కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఇద్దరు వైద్యుల పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. వృత్తిలో

కారునే ఇల్లుగా మార్చుకున్న వైద్యులు.. సీఎం ప్రశంసలు

భోపాల్: కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఇద్దరు వైద్యుల పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. వృత్తిలో చూపిస్తున్న నిబద్ధతకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జేపీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆ వైద్యుల పేర్లు సచిన్ నాయక్, సచిన్ పటీదార్. కరోనా బాధితులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వీరు ఇంటికి కూడా వెళ్లడం లేదు. తాము ఇంటికి వెళ్లి కుటుంబాలను ప్రమాదంలో పడేయడం ఇష్టంలేని వీరిద్దరూ తమ కార్లనే ఇళ్లుగా మార్చుకున్నారు. గత కొన్ని రోజులుగా కార్లలోనే గడుపుతున్నారు. నిత్యవసరాలు, అవసరమైన పుస్తకాలను కారులోనే ఏర్పాటు చేసుకున్నారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ, ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ గడుపుతున్నారు. 


సచిన్ నాయక్ కార్లో కూర్చుని పుస్తకం చదువుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ స్పందించారు. కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు పోరాడుతున్న సైనికులు మీరంటూ సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. 


ముగ్గురు పిల్లల తండ్రైన సచిన్ నాయక్ ఐసోలేషన్ వార్డులో పనిచేస్తున్నారు. ప్రతి రోజూ వందమందికిపైగా రోగులను చూస్తారు. తాము రోజూ శాంపిల్స్ సేకరిస్తామని, దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని సచిన్ నాయక్ అన్నారు. అందుకనే తాను కారులోనే ఉంటున్నట్టు తెలిపారు. సచిన్ పటీదార్ అనెస్థీషియా నిపుణుడు. మార్చి 31 నుంచి కారులోనే ఉంటున్నారు.  

Updated Date - 2020-04-10T03:12:48+05:30 IST