గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత
ABN , First Publish Date - 2022-03-14T22:59:54+05:30 IST
నార్త్ గుజరాత్లోని భిలోడ (ఎస్టీ) నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ అనిల్ జోషియార...
గాంధీనగర్: నార్త్ గుజరాత్లోని భిలోడ (ఎస్టీ) నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ అనిల్ జోషియార సోమవారంనాడు కన్నుమూశారు. కోవిడ్ అనంతర సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. జోషియారా మృతిని ఆయన కుమారుడు కేవల్ జోషియార ధ్రువీకరించారు. ఈసీఎంఓ ద్వారా చికిత్స కోసం ఫిబ్రవరి 7న చెన్నై ఆసుపత్రిలో తన తండ్రి చేరినట్టు చెప్పారు. విమానంలో తన తండ్రి భౌతిక కాయాన్ని అహ్మదాబాద్లోని ఎస్వీపీఐ విమానాశ్రయానికి మంగళవారం ఉదయం 6.30 గంటలకు తీసుకు వస్తున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి జోషియార స్వస్థలమైన చునా ఖాన్ గ్రామానికి తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
కాగా, చెన్నై ఆసుపత్రిలో జోషియార చేరక ముందు జనవరి 15న అహ్మదాబాద్లోని ప్రైవేట్ సీఐఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన 1995 నుంచి 1997 వరకూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2000 వరకూ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భిలోడ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా 2002, 2007, 2012, 2017 సంవత్సరాల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు.