ఈ నెల 8న భారత్‌ బంద్‌

ABN , First Publish Date - 2020-12-05T08:12:44+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. శుక్రవారం 35 రైతు సంఘాల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు...

ఈ నెల 8న భారత్‌ బంద్‌

  • నేడు దేశవ్యాప్త ఆందోళన
  • 9వ రోజుకు చేరిన నిరసనలు
  • నేడు మరో దఫా చర్చలు

న్యూఢిల్లీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. శుక్రవారం 35 రైతు సంఘాల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కేంద్రంతో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు, మోదీ ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై చర్చించారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి లాఖోవాల్‌ ప్రకటించారు. 5వ తేదీన దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని నిర్ణయించామని తెలిపారు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.


శనివారం రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మరో దఫా చర్చలు జరపనుంది. వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ చెబుతున్నదాని ప్రకారం... ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలిపోవచ్చు. అటు ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్‌ సంఘ్‌ కూడా రైతుల డిమాండ్లకు మద్దతు పలుకింది. కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగించాలని, ప్రభుత్వ, ప్రైవేటు మండీల్లో కూడా ఎంఎస్పీ రేటే అమలుకావాలని, ఇందుకు చట్టం చేయాలని, ఎంఎస్పీ కంటే చౌక ధరకు కొనడం నేరమని చట్టంలో చేర్చాలని బీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి బదరీనారాయణ చౌధురి మీడియాతో అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి రైతు కోర్టులను ఏర్పాటుచేయాలి తప్ప ఎస్‌డీఎం కోర్టుల్లో కాదని కూడా ఆయన కోరారు. మరోవైపు, దేశరాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలను మిన్నంటాయి. సింఘూ, టిక్రీ, గాజీపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై రైతులు నిరసనలు సాగిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ రాత్రంతా రోడ్లపైనే నిద్రిస్తున్నారు. అక్కడే వండుకొని ఆహారాన్ని తింటున్నారు. నిరసనల వల్ల పలు రహదారులను మూసివేశారు. నిరసనల్లో పలువురు తెలంగాణకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. తృణముల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ రైతు నేతలతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ తరువాత తమ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ను ... సంఘూ సరిహద్దులకు పంపి- రైతులను కలుసుకొని సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలియపర్చారు. ఆయన అక్కడినుంచి మమతతో ఫోన్లో మాట్లాడించారు. 


సాహిత్య అకాడమి అవార్డు వాపస్‌

రైతులకు మద్దతుగా ప్రముఖ రచయిత డాక్టర్‌ జస్వీందర్‌ సింగ్‌ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును వాపస్‌ ఇచ్చారు. ‘‘రైతుల పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్దాక్షిణ్య వైఖరి, మానవ హక్కుల ఉల్లంఘన నన్ను బాధించింది. అందుకే అవార్డు వాపస్‌ ఇస్తున్నాను’’ అని ప్రకటించారు. 


రైతుల వెంట ప్రజలున్నారు: బీ వెంకట్‌

రైతులు ఒంటరివారు కాదని, వారి వెనుక దేశ ప్రజలున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ అన్నారు. దేశ ప్రజలు కావాలా లేదా అదానీలు, అంబానీలు కావాలా అన్నది ప్రధాని తేల్చుకోవాలని సూచించారు. రైతులకు మద్ధతుగా వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఆయన ఈ మాటలన్నారు. కాగా, ఢిల్లీ చుట్టూ రహదారులను రైతులు దిగ్భందించడంతో నిత్యవసరాలకు కొరత ఏర్పడొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రోడ్ల మూసివేత వల్ల రవాణా వాహనాలు పూర్తి స్థాయిలో  రాలేకపోతున్నాయి. దాంతో నిరసన లు కొనసాగితే త్వరలో సరుకులకు కొరత ఏర్పడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 


రైతులను తరలించండి సుప్రీంలో పిటిషన్‌

దేశరాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను అక్కడి నుంచి తొలగించేట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ  సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. నిరసనల వల్ల ఢిల్లీలో కరోనా విజృంభించొచ్చని పిల్‌ వేసిన న్యాయవాది ఓం ప్రకాశ్‌ పరిహార్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయ ని, రైతుల ఆందోళనతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతుంద న్నారు. బురారీ గ్రౌండ్స్‌లో నిరసన జరిపేందుకు ప్రభుత్వం అనుమతించిందని, అక్కడికి  తరలించాలన్నారు. రోడ్లను దిగ్భందించడం సరికాదని షహీన్‌బాగ్‌ కేసులో సుప్రీం  తీర్పును ఉటంకించారు. 


Updated Date - 2020-12-05T08:12:44+05:30 IST