Bhagwant Mann మంత్రివర్గ విస్తరణ ఖరారు.. కొత్తగా ఐదుగురికి చోటు
ABN , First Publish Date - 2022-07-03T21:06:58+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) ఈనెల 4వ తేదీ సోమవారంనాడు..
చండీగఢ్: పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) ఈనెల 4వ తేదీ సోమవారంనాడు మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) చేపట్టనున్నారు. కొత్తగా ఐదుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. పంజాబ్లో మూడు నెలల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న తొలి మంత్రివర్గ విస్తరణ ఇదే కావడం విశేషం. పంజాబ్ రాజ్భవన్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని ఒక అధికారి తెలిపారు.
కొత్తగా ఐదుగురు మంత్రులను తీసుకోనుండటంతో మాన్ మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఆయనతో కలిపి 15కు చేరుతుంది. మంత్రివర్గంలో కొత్తగా చేర్చుకునే వారిలో సునం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన అమన్ అరోరా, జగ్రావ్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన సర్వజిత్ కౌర్ మనుకే, తల్వాండి సబో నుంచి రెండుసార్లు గెలిచిన బల్జీందర్ కౌర్, బుద్లాడా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్, అమృత్సర్ సౌత్ ఎమ్మెల్యే సింగ్ నిజ్జర్, ఖరార్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ పేర్లు బలంగా వినిపిస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మాన్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వంలో 10 మందిని మంత్రులుగా తీసుకున్నారు. ముఖ్యమంత్రితో కలిసి 18 మందికి మంత్రివర్గంలో చోటుంది. ప్రస్తుతం తొమ్మిది మంది మంత్రులు మాన్ క్యాబినెట్లో ఉన్నారు.