పెగాసస్ కొత్త వెర్షన్‌కు ట్రై చేయండి: కేంద్రంపై చిదంబరం వ్యంగ్యోక్తులు

ABN , First Publish Date - 2022-01-30T21:25:05+05:30 IST

మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే ఇజ్రాయెల్ 'పెగాసస్' స్పైవేర్‌కు సంబంధించి 2017లో..

పెగాసస్ కొత్త వెర్షన్‌కు ట్రై చేయండి: కేంద్రంపై చిదంబరం వ్యంగ్యోక్తులు

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే ఇజ్రాయెల్ 'పెగాసస్' స్పైవేర్‌కు సంబంధించి 2017లో ఇజ్రాయెల్, భారత్ మధ్య ఒప్పందం జరిగిందంటూ వచ్చిన వార్తలు ఇప్పటికే కలకలం రేపుతుంటే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం తాజాగా కేంద్రంపై వ్యంగ్యోక్తులు గుప్పించారు. పెగాసస్ స్పైవేర్ కొత్త వెర్షన్ వచ్చిందా అని ఇజ్రాయెల్‌ను అడగడానికి ఇదే సరైన తరుణమని పరోక్షంగా కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


''ఇండియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు సరికొత్త లక్ష్యాలకు చేరుకోవాల్సిన తరుణం ఇదేనని మన ప్రధాని చెబుతున్నారు. పనిలో పనిగా పెగాసస్ స్పైవేర్ కొత్త వెర్షన్ వచ్చిందా అని ఇజ్రాయెల్‌ను అడగడానికి కూడా ఇదే సరైన సమయం'' అని చిదంబరం ట్వీట్ చేశారు. ''2024 కంటే ముందే అలాంటి సాఫ్ట్‌వేర్ వస్తే 4 బిలియన్ డాలర్లు మనం వారికి ఇవ్వొచ్చు'' అంటూ చిదంబరం మరో ట్వీట్ చేశారు.


భారత్, ఇజ్రాయెల్ మధ్య 2 బిలియన్ డాలర్ల మేరకు ఒప్పందం జరిగిందని, అత్యాధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు, పెగాసస్ స్పైవేర్ కేంద్రకంగా ఈ డీల్ జరిగిందని ''ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్ వెపన్'' అనే శీర్షికతో 'న్యూయార్క్ టైమ్స్' ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో కొంతమంది ప్రముఖ వ్యక్తులపై నిఘా కోసం పెగాసస్ స్పైవేర్‌ను కేంద్రం ఉపయోగించిందంటూ ప్రతిపక్షాలు కొద్దికాలంగా చేస్తున్న ఆరోపణలు తాజా నివేదకతో మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్ 27న ముగ్గురు సభ్యుల సైబర్ నిపుణుల ప్యానెల్‌ను నియమించింది.

Updated Date - 2022-01-30T21:25:05+05:30 IST