జేఈఈలో సిక్కోలు సత్తా
ABN , First Publish Date - 2022-08-09T04:35:33+05:30 IST
జేఈఈ మెయిన్స్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. తొలివిడత ఫలితాల్లో జిల్లా నుంచి ఆమదాలవలస మునిసిపాలిటీకి చెందిన సుహాష్ ఒక్కరే ఎంపిక కాగా.. తాజాగా సోమవారం విడుదలైన రెండో విడత ఫలితాల్లో మరికొంత మంది విద్యార్థులు ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. శ్రీకాకుళం నగరం షిరిడీ సాయికాలనీకి చెందిన
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ సంతబొమ్మాళి/ ఆమదాలవలస/ పోలాకి / మెళియాపుట్టి/ అరసవల్లి)
జేఈఈ మెయిన్స్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. తొలివిడత ఫలితాల్లో జిల్లా నుంచి ఆమదాలవలస మునిసిపాలిటీకి చెందిన సుహాష్ ఒక్కరే ఎంపిక కాగా.. తాజాగా సోమవారం విడుదలైన రెండో విడత ఫలితాల్లో మరికొంత మంది విద్యార్థులు ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. శ్రీకాకుళం నగరం షిరిడీ సాయికాలనీకి చెందిన మెండ హిమవంశీ జేఈఈలో ఆల్ఇండియాలో 7వ ర్యాంకు సాధించాడు. ఓబీసీ కోటాలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. హిమవంశీ తల్లిదండ్రులు రవిశంకర్, పి.స్వరాజ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులు. హిమవంశీ విజయవాడలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
- సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన పల్లి జలజాక్షి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 2వ ర్యాంకు సాధించింది. జలజాక్షి తండ్రి గోవిందరావు అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి విజయలక్ష్మీ గృహిణి. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివిన జలజాక్షి 983 మార్కులు సాధించింది. ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది.
- ఆమదాలవలస మునిసిపాలిటీ గేదెలవానిపేటకు చెందిన కొయ్యాన సుహా్స్.. ఓపెన్ కేటగిరిలో ఆలిండియా స్థాయిలో 22వ ర్యాంక్ సాధించాడు. ఓబీసీ కోటా నాలుగో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సుహాస్ ఒకటి నుంచి ఐదోతరగతి వరకు శ్రీకాకుళంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 6 నుంచి ఇంటర్ వరకు విజయవాడలో ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకున్నాడు. తండి శిమ్మన్న నవనంబాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి సుధారాణి గృహిణి. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేస్తానని సుహాస్ చెప్పాడు.
- పోలాకి మండలం దీర్గాశి గ్రామానికి చెందిన నక్క దీపిక ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 12వ ర్యాంకు సాధించింది. ఎంసెట్లో 37వ ర్యాంక్ సాధించి ప్రతిభ చూపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు జ్యోతి, జయరాం దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
- శ్రీకాకుళం పట్టణం పీఎన్ కాలనీకి చెందిన బెండి రుత్విక్చంద్ర 99.9 పర్సంటైల్తో ఆలిండియా స్థాయిలో 1400వ ర్యాంకు సాధించాడు. ఓబీసీ విభాగంలో 210వ ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి తండ్రి బెండి రవికుమార్ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్ లెక్చరర్ కాగా, తల్లి ఇందిర ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
- మెళియాపుట్టి మండలం మాకనాపల్లికి చెందిన వంటన మోహన్రాజు ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 6,855వ ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరిలో 1,416 ర్యాంకు కైవసం చేసుకున్నాడు.
- సంతబొమ్మాళి మండలం పాలతలగాం గ్రామానికి చెందిన ఆవల చైతన్య లక్ష్మీప్రకాష్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1,825వ ర్యాంకు సాధించాడు. చైతన్య విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.