గర్భిణులకు అత్యుత్తమ వైద్యసేవలందించాలి
ABN , First Publish Date - 2022-07-01T06:36:25+05:30 IST
ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజని అన్నారు. గురువారం విక్టోరియా జనరల్ ఆస్పతిలో (ఘోషా)లో ఆమె ఆకస్మికంగా పర్యటించారు.
వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజని
ఘోషాస్పత్రిలో ఆకస్మిక పర్యటన
మహారాణిపేట, జూన్ 30: ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజని అన్నారు. గురువారం విక్టోరియా జనరల్ ఆస్పతిలో (ఘోషా)లో ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలను పలకరించి, వారికి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. కేస్షీట్లు, వార్డు పరిసరాలను పరిశీలించారు. ఆరోగ్య మిత్ర నర్సులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, తల్లీ బిడ్డల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. శానిటరీ ,సెక్యూరిటీ సిబ్బంది విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. అనంతరం బాలింతలు, గర్భిణులకు పండ్లను పంపిణీ చేశారు. నాడు నేడు పథకంలో భాగంగా ఆస్పత్రి మోడల్ ఫోటోలను పరిశీలించారు. చిన్నారిని ఎత్తుకొని తల్లీబిడ్డ వాహనం వరకు తీసుకువెళ్లి అక్కడి తల్లికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎ.మల్లికార్జున, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ ఉష, ఇతర వైద్యులు పాల్గొన్నారు.