ప్రముఖ కవి శంఖ ఘోష్ కరోనాతో కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-21T18:50:29+05:30 IST

ప్రముఖ బెంగాలీ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శంఖ ఘోష్ కొవిడ్-19తో కన్నుమూశారు. కొద్ది రోజులుగా తన...

ప్రముఖ కవి శంఖ ఘోష్ కరోనాతో కన్నుమూత

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శంఖ ఘోష్ కొవిడ్-19తో కన్నుమూశారు. కొద్ది రోజులుగా తన నివాసంలో ఐసొలేషన్‌లో ఉంటున్న ఘోష్.. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 89 ఏళ్ల ఆయన ఈ నెల 14న కరోనా బారిన పడ్డారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ గృహనిర్బంధంలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వివిధ ఆరోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన ఘోష్‌కు కొద్ది నెలల క్రితం ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. 1932 ఫిబ్రవరి 6న చంద్‌పూర్‌లో ఘోష్ జన్మించారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌లో ఉంది. 


‘‘ఆదిమ్ లాటా-గుల్మోమే’’, ‘‘ముర్ఖా బారో, సమాజిక్ నాయ్ ’’ సహా ఇతర పుస్తకాలు ఘోష్‌కు విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి. పలు సామాజిక, రాజకీయ అంశాలపై పదునైన విమర్శకుడిగా పేరున్న ఆయనకు 2011లో పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. 2016లో ఆయనను జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 1977లో తాను రాసిన ‘‘బాబర్ ప్రార్థన’’ గ్రంథానికి గానూ ఆయన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన రాసిన గ్రంథాలు హిందీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లోకి అనువాదం అయ్యాయి.  

Updated Date - 2021-04-21T18:50:29+05:30 IST