Pegasus వ్యవహారంపై దర్యాప్తు.. పశ్చిమబెంగాల్ సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2021-07-26T20:54:32+05:30 IST

పెగాసస్ స్పైవేర్‌ నిఘా నీడ భారతీయులపై పడిందన్న ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను వెలికి తీసేందుకు బెంగాల్ ప్రభుత్వం సిద్ధమైంది.

Pegasus వ్యవహారంపై దర్యాప్తు.. పశ్చిమబెంగాల్ సంచలన నిర్ణయం!

కోల్‌కతా: పెగాసస్ స్పైవేర్‌ నిఘా నీడ భారతీయులపై పడిందన్న ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను వెలికి తీసేందుకు బెంగాల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, జస్టిస్ ఎం.బీ. లోకుర్ ఈ అంశంపై దృష్టి సారించనున్నారు. పెగాసస్ వ్యవహారంపై దేశంలో అధికారికంగా చేపడుతున్న తొలి దర్యాప్తు ఇదే కావడంతో ఈ పరిణామానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 


‘‘కేంద్రమే ఓ ఎంక్వైరీ కమిషన్ ద్వారాగానీ లేదా కోర్టు ద్వారా గానీ దర్యాప్తు ప్రారంభిస్తుందనుకున్నాం. కానీ..కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు కూర్చుంది. దీంతో..మేమే ఓ దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. ఈ తొలి అడుగు ఇతరులకు మేలుకొలుపుగా మారుతుందని ఆశిస్తున్నా’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా.. 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఓ భారతీయ క్లైయింట్ కొందరు ప్రముఖలపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రముఖల పేర్లున్న ఓ జాబితా కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో బెంగాల్ సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు.

Updated Date - 2021-07-26T20:54:32+05:30 IST