కన్నుమూసి తెరిచేలోపే...
ABN , First Publish Date - 2022-05-25T06:41:07+05:30 IST
తుగ్గలి మండలం జొన్నగిరిలో మంగళ వారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన సంఘ టనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
తుగ్గలి, మే 24: తుగ్గలి మండలం జొన్నగిరిలో మంగళ వారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన సంఘ టనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఏడుగురు గాయ పడ్డారు. పేలుడు దాటికి ఓ ఇల్లు కూలిపోయింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలివీ... నాగశేషు అనే వ్యక్తి ఇంట్లో అతని భార్య హోసూరమ్మ మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది ఈ సంఘటనలో నాగశేషు (60)తో పాటు అతడి తల్లి మద్దమ్మ (80) మృతి చెందారు. అదే ఇంట్లో ఉన్న నాగశేషు భార్య హోసూరమ్మ, తమ్ముడి కుమార్తె స్ఫూర్తి, మనవరాలు వర్షిణి, కోడలు పెద్దక్క తీవ్రంగా గాయపడ్డారు. పక్క ఇంట్లో ఉంటున్న నాగమ్మ, రాశి, నజ్మా గాయపడ్డారు. మద్దమ్మ అక్కడికక్కడే మృతిచెందగా... నాగశేషు గుత్తి వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న వారు మంటలను ఆర్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు.