శిథిల భవనాలు, వృక్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-01-21T05:52:08+05:30 IST
శిథిల భవనాలు, వృక్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బిల్డింగుల యజమానులకు నోటీసులివ్వండి
నగరపాలక సంస్థ అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశం
ఖమ్మం కార్పొరేషన్, జనవరి 20 : శిథిలావస్థకు చేరిన వృక్షాలు, భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలకు సంబంధించి యజమానులకు నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం ఓ ప్రకటనలో నగరపాలక సంస్థ అదికారులను ఆదేశించారు. ప్రమాదకర వృక్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నగరంలోని బ్రాహ్మణబజార్లో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటన లాంటివి మళ్లీ జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. శిథిల భవనాలను గుర్తించటమే కాకుండా, అందులో నివశించేవారిని వెంటనే ఖాళీ చేయించాలని మంత్రి ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మోడువారి, శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. సిబ్బంది ద్వారా వాటిని తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.