జగనన్న కాలనీకి వెళ్లాలంటే జాగ్రత్త సుమా!
ABN , First Publish Date - 2022-08-11T06:38:15+05:30 IST
వారం రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలకు మాకవరపాలెం శివారులోని జగనన్న కాలనీ రోడ్లు బురదమయమయ్యాయి.
రహదారులు బురదమయం
లబ్ధిదారుల గగ్గోలు
మాకవరపాలెం, ఆగస్టు 10: వారం రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలకు మాకవరపాలెం శివారులోని జగనన్న కాలనీ రోడ్లు బురదమయమయ్యాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ కాలనీలో 150 మందికి స్థలాలు కేటాయించగా 80 మంది ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే వర్షాల కారణంగా ఈ కాలనీలోని ఎనిమిది రహదారులు పూర్తిగా బురదమయంగా ఉండడంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పనులు నిలిచిపోయాయి. మట్టి రోడ్లు పూర్తిగా బురదగా మారడంతో గృహ నిర్మాణ సామగ్రిని కూడా తరలించడం సాధ్యం కావడం లేదు. లబ్ధిదారులు నడిచి వెళ్లడానికి కూడా వీలులేకుండా ఉంది. దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారులు నిర్మించాలని, లేకపోతే నిర్మాణాలు చేపట్టలేమని వారు చెబుతున్నారు.