ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి అధికారికంగా వివో ఔట్
ABN , First Publish Date - 2020-08-06T21:41:37+05:30 IST
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా తప్పుకుంది. బీసీసీఐ, వివో మధ్య జరిగిన...
ముంబై: ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా తప్పుకుంది. బీసీసీఐ, వివో మధ్య జరిగిన ఒప్పందం 2020 సంవత్సరానికి గానూ రద్దు చేసుకున్నట్లు ఐపీఎల్ స్పష్టం చేసింది. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పటికే టిక్టాక్తో సహా పలు చైనీస్ యాప్స్పై కేంద్రం నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలిసింది. అయితే.. ప్రస్తుతానికి ఈ సంవత్సరం వరకూ తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
దేశమంతా చైనా కంపెనీలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బీసీసీఐ మాత్రం వివోను కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇంత స్వల్ప కాలంలో మరో కంపెనీ దొరకడం సాధ్యం కాదని బోర్డు భావించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే ఐపీఎల్ను బహిష్కరించాలంటూ దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) పిలుపునిచ్చింది. దీంతో.. వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్తో చేసుకున్న ఒప్పందాన్ని బీసీసీఐ ఎట్టకేలకు ఈ సీజన్ వరకూ రద్దు చేసుకుంది. ఐపీఎల్ 2020కి త్వరలో కొత్త కంపెనీ స్పాన్సర్ చేయనుంది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరిగే ఈ లీగ్ కోసం ఆటగాళ్లంతా యూఏఈలో అడుగుపెట్టబోతున్నారు.