బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం లూటీ

ABN , First Publish Date - 2020-11-29T06:27:12+05:30 IST

పేరూరు వై.జంక్షన్‌ సమీపంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఏటీఎంను చోరులు లూటీ చేశారు. రూ.23 లక్షల మేర చోరీ జరిగినట్టు భావిస్తున్నారు. శనివారం రాత్రి పట్టణ పోలీసులు, బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం లూటీ

  • - రూ.23లక్షలు మేర చోరీ?

అమలాపురం రూరల్‌, నవంబరు 28: పేరూరు వై.జంక్షన్‌ సమీపంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఏటీఎంను చోరులు లూటీ చేశారు. రూ.23 లక్షల మేర చోరీ జరిగినట్టు భావిస్తున్నారు. శనివారం రాత్రి పట్టణ పోలీసులు, బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 216 జాతీయ రహదారిని ఆనుకుని పేరూరులో బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఏటీఎంను ఏర్పాటుచేశారు. ఈనెల 26న ఏటీఎంలో రూ.25లక్షల మేర నగదు పెట్టినట్టు సమాచారం. నివర్‌ తుపాన్‌ కారణంగా మూడ్రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ఏటీఎం షట్టర్‌ను తెరవలేదు. శనివారం మధ్యాహ్నం ఏటీఎం లోపలనుంచి కాలిన వాసన వస్తుండడంతో స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏటీఎంను తెరిచి చూడగా చోరులు గ్యాస్‌కట్టర్‌ సాయంతో ఏటీఎం మిషన్‌లోని క్యాష్‌ యూనిట్‌ మొత్తాన్ని పట్టుకుపోయినట్టు గుర్తించారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఈ ఏటీఎం హిటాచీ సంస్థ అధీనంలో నడుస్తోంది. నగదు లోడింగ్‌ వ్యవహారాలను రైటర్స్‌ సంస్థ నిర్వహిస్తున్నట్టు సమాచారం. బ్యాంకుకు చెందిన కె.కరుణకుమార్‌తోపాటు పట్టణ పోలీసులు ఏటీఎంలో చోరీ జరిగినట్టు గుర్తించి వెంటనే విశాఖపట్నంలోని జోనల్‌ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈనెల 26న ఏటీఎంలో ఎంతమేర నగదును లోడింగ్‌ చేశారు, చోరీ జరిగే సమయానికి అందు లో ఎంత నగదు ఉందో ఇంకా అధికారులు పూర్తిగా గుర్తించలేదు. హిటాచీ కంపెనీకి చెందిన లీగల్‌టీమ్‌ బృందం ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకోనున్నట్టు సమాచారం. పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై బ్యాంకుకు చెందిన అధికారులు ఎవరూ పట్టణ పోలీసులకు ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. ఈ వ్యవహారంపై హిటాచీ సంస్థగానీ, నగదు లోడింగ్‌ వ్యవహారాలు నిర్వహించే రైటర్స్‌సంస్థగానీ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2020-11-29T06:27:12+05:30 IST