ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
ABN , First Publish Date - 2022-07-03T05:42:38+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలలో బ్యాంక్ల ప్రమేయం, వివిధ రకాల రుణాలు పొందే విధానం, కొత్తగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించటం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించటానికి లీడ్బ్యాంక్ ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది.
ఉమ్మడి జిల్లాలో పది మండల కేంద్రాల్లో శిక్షణ
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలలో బ్యాంక్ల ప్రమేయం, వివిధ రకాల రుణాలు పొందే విధానం, కొత్తగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించటం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించటానికి లీడ్బ్యాంక్ ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది. తొలిదశలో పది మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు సెంట్రల్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసి (సీఎఫ్ఎల్) అనే పేరుతో వీటిని పిలుస్తారు. తొలిదశలో చిలకలూరిపేట, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి, తాడేపల్లి, తెనాలి, అమరావతి, మాచర్ల, పిడుగురాళ్ళ, బెల్లంకొండ మండలాలను ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రానికి మూడు మండలాల చొప్పున తొలిదశలో 30 మండలాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో లీడ్బ్యాంక్గా ఉన్న యూనియన్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీనిని కొనసాగిస్తున్నారు. బ్యాంక్ ఖాతాదారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోటానికి నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నామని లీడ్బాంక్ కన్వీనర్ రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రజలు బ్యాంక్ల సేవలను ఉపయోగించుకోటానికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎల్డీఎం ఈదర రాంబాబు వివరించారు. ప్రధానం ఇక్కడ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి జనధన్ ఖాతాలను ప్రారంభిస్తున్నారు. బ్యాంకుల్లో పంటరుణాలు, బంగారం తాకట్టుపై రుణాలు పొందటం, విద్య, గృహ రుణాలు ఎలా తీసుకోవాలి, బ్యాంక్ వడ్డీ, నగదు ర హిత చెల్లింపుల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.