Bankకు తెలంగాణ బీజేపీ నేత కుమారుడి టోకరా.. రెండున్నర కోట్లు తీసుకుని..
ABN , First Publish Date - 2022-05-01T13:07:48+05:30 IST
Bankకు తెలంగాణ బీజేపీ నేత కుమారుడి టోకరా.. రెండున్నర కోట్లు తీసుకుని..
- రూ. రెండున్నర కోట్లు తీసుకుని ఎగవేత
- మార్టిగేజ్ చేసిన ఆస్తి అమ్మేసిన
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించకపోగా, బ్యాంక్కు మార్టిగేజ్ చేసిన స్థలాన్ని అమ్ముకున్న ఉదంతంలో కోర్టు ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పఠాన్చెరు గౌతమ్నగర్ కాలనీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కుమారుడు టి.ఆశిష్గౌడ్, కూకట్పల్లి వివేకానందనగర్కు చెందిన టి.సుమంత్లు బీరంగూడలోని శివంత ఫార్మాలో భాగస్వాములు. వీరు ఎస్బీఐ బెల్లావిస్టా బ్రాంచి నుంచి 2018లో రూ. రెండున్నర కోట్లు రుణం తీసుకున్నారు.
ఇందుకోసం ఆశిష్గౌడ్ పేరిట పఠాన్చెరు గౌతమ్నగర్ కాలనీలోని సర్వేనంబర్ 740లో 460 గజాల్లో నాలుగంతస్థుల ఇల్లు, స్థలాన్ని 2018 మే 28న బ్యాంకునకు మార్టిగేజ్ చేశారు. 2019లో ఖాతాను సోమాజిగూడ ఎస్బీఐ ఎంఎంఈకు మార్చుకున్నారు. అయితే, తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించలేదు. దీంతో 2021లో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా, స్పందించకపోవడంతో తమకు మార్టిగేజ్ చేసిన భవనం వద్దకు వెళ్లగా, అక్కడ ఇతరులు ఉన్నారు. వారు తాము ఆశిష్గౌడ్ వద్ద కొనుగోలు చేశామని చెప్పారు. దీంతో బ్యాంకు అదికారులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు శివంత ఫార్మా, టి.సుమంత్, టి.ఆశిష్గౌడ్లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.