తబ్లీగీ జమాత్ను నిషేధించండి
ABN , First Publish Date - 2020-04-08T07:28:30+05:30 IST
తబ్లీగీ జమాత్ కార్యకలాపాలను తక్షణమే నిషేధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డేకు ఫిర్యాదు అందింది.
కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించండి
సీజేఐకి లేఖ..రిట్గా పరిగణించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: తబ్లీగీ జమాత్ కార్యకలాపాలను తక్షణమే నిషేధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డేకు ఫిర్యాదు అందింది. తన లేఖనే రిట్ పిటిషన్గా పరిగణించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అజయ్ గౌతమ్ సీజేఐ బోబ్డేకు ఓ లేఖ రాశారు. నిజాముద్దీన్లో ఉన్న తబ్లీగీ జమాత్ సంస్థ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఢిల్లీ సర్కారును ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కొంతమంది తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా, విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తబ్లీగీ జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చినా ఆ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన 150మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్ప్రదేశ్లోనూ 36మందిపై కేసులుపెట్టారు. మరోవైపు.. తబ్లీగీ జమాత్ కొవిడ్-19 లింకుల గురించి వార్తా కథనాలను ప్రసారం చేస్తున్న చానళ్ల జర్నలిస్టులను కొంతమంది బెదిరించడాన్ని ఎన్బీఏ ఖండించింది.
క్వారంటైన్ ఎదుటే మల విసర్జన.. ఇద్దరిపై కేసు
ఢిల్లీలోని నరేలా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఇద్దరు తబ్లీగీ సభ్యులు రెండో అంతస్తులో ఉన్న ఒక గది ఎదుటే మలవిసర్జన చేశారు. పారిశుధ్య కార్మికుల ఫిర్యాదుతో వారిద్దరిపై కేసు నమోదు చేశారు.