ఇక రైలు ప్రయాణికుల ఇంటి ముంగిటకు సామాన్లు
ABN , First Publish Date - 2020-10-23T11:39:39+05:30 IST
రైలు ప్రయాణికులకు శుభవార్త...రైలు ప్రయాణికుల ఇంటి నుంచి రైల్వేస్టేషనుకు...
బ్యాగ్సు ఆన్ వీల్ సేవలు త్వరలో ప్రారంభం
న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు శుభవార్త...రైలు ప్రయాణికుల ఇంటి నుంచి రైల్వేస్టేషనుకు, రైల్వేస్టేషను నుంచి ఇంటి ముంగిటకు వారి సామాన్లను రవాణ చేసే సరికొత్త సేవలకు భారతీయ రైల్వే ప్రారంభించనుంది. దేశరాజధాని ఢిల్లీతోపాటు ఘజియాబాద్, గురుగావ్ నగరాల నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులు త్వరలో ప్రారంభించబోయే ‘బ్యాగ్సు ఆన్ వీల్’ సేవలను పొందవచ్చు. దీనిద్వారా ప్రయాణికుల సామాన్లను ఇంటి నుంచి రైల్వేస్టేషనుకు, రైల్వేస్టేషను నుంచి ఇంటి ముంగిటకు రవాణా చేయనున్నారు.
ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ యాప్ బేస్డ్ బ్యాగ్సు ఆన్ వీల్ సేవలను తాజాగా ప్రకటించింది. ఈ సేవలను ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సారాయ్ రోహిల్లా, ఘజియాబాద్, గురుగావ్ రైల్వేస్టేషన్ల నుంచి ఎక్కే, దిగే ప్రయాణికులు వినియోగించుకోవచ్చు.ఈ సేవలకు నామమాత్రంగా డబ్బు చార్జ్ చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు. ఇలాంటి సేవలు అందించనుండటం భారతీయ రైల్వేలోనే మొట్టమొదటిసారి అని నార్తరన్, నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రాజీవ్ చౌదరి తెలిపారు.