మందు బాబులకు చేదు వార్త!
ABN , First Publish Date - 2021-03-04T18:22:33+05:30 IST
మందుబాబులకు చేదువార్త!
చెన్నై : మందుబాబులకు చేదువార్త! రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలయ్యే దాకా రోజుకు ఒక్కొక్కరికి రెండు ఫుల్ బాటిళ్లు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అంతకు మించి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వచ్చే ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం తో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ తమ సభలకు, రోడ్షోలకు కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను కూడా తరలించేందుకు చర్యలు తీసుకుంటు న్నాయి. అదే సమయంలో సభలకు, రోడ్షోలకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలకు రూ. 300ల నుండి రూ.500ల వరకూ రోజువారీ భత్యంగా చెల్లిస్తుంటారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ విందులు తప్పనిసరి. ఆ తర్వాత ఇళ్లకు తిరిగివెళ్లే ముందు టాస్మాక్ దుకాణా నికి వెళ్ళి మద్యం కొనుగోలు చేసుకెళుతుంటారు. ఈ పరిస్థితి వల్ల పీకలదాకా తాగిన మందుబాబులు గొడవలకు పాల్పడుతుంటారు.
ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులను నిరోధించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఒక వ్యక్తికి రెండు ఫుల్బాటిళ్ల కు మించి మద్యాన్ని విక్రయించకూడదంటూ పరిమి తిని విఽధించింది. రెండు ఫుల్బాటిల్స్ లభించకపోతే నాలుగు ‘హాఫ్బాటిల్స్’ కొనుగోలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. హాఫ్బాటిల్స్ కొరతగా ఉంటే ఎనిమిది ‘క్వార్టర్’ బాటిళ్ల చొప్పున మద్యం కొనవచ్చని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.