హిమాలయాల్లో కొత్త పక్షిని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు
ABN , First Publish Date - 2021-04-11T01:43:49+05:30 IST
బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్) తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు.
న్యూఢిల్లీ: బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్) శాస్త్రవేత్తలు తూర్పు హిమాలయాల్లో ఓ కొత్త పక్షిని కనుగొన్నారు. దీంతో దేశంలో పక్షి జీవవైవిధ్యం సంఖ్య 1,340కి చేరుకుంది. పిచ్చుకను పోలి ఉండే ఈ రోజ్ఫించ్ సముద్ర మట్టానికి 3,800 మీటర్ల ఎత్తున అరుణాచల్ప్రదేశ్లోని సెలా పాస్ శంఖాకార అడవుల్లో ఫిబ్రవరి 8న కనిపించింది.
దక్షిణ చైనాలో కనిపించే ఈ పక్షి భూటాన్లోనూ తిరుగాడుతుంటుంది. ఫించ్లలో పలు జాతులు ఉన్నాయని, శీతాకాలంలో ఇవి నైరుతి చైనా నుంచి భారత్కు వలస వస్తుంటాయని అధ్యయనకర్త గిరీశ్ జాథర్ తెలిపారు. సిక్కిం, అరుణాచల్ప్రదేశ్లలోని పది రకాల ఫించ్లు ఉన్నాయని, వాటి సంఖ్య ఎంత అనేదానిపై జరుగుతున్న అధ్యయనం మధ్యలో ఉందని పేర్కొన్నారు. వీటిపై వాతావరణ మార్పుల ప్రభావం ఎంత అనేదానిని తర్వాత అంచనా వేస్తామన్నారు.