ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2022-08-16T05:42:56+05:30 IST
ఆటోడ్రైవర్ల కాలనీ నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసు కోవడంతో ఆటోడ్రైవర్లకు అన్ని విధాల న్యాయం చేయాలని పీలేరులోని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
పీలేరు, ఆగస్టు 15: ఆటోడ్రైవర్ల కాలనీ నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై చర్యలు తీసు కోవడంతో ఆటోడ్రైవర్లకు అన్ని విధాల న్యాయం చేయాలని పీలేరులోని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆమేరకు సోమవారం పీలేరులో వారు ఆందోళన చేపట్టారు. పీలేరు ఇందిరమ్మ కాలనీ వద్ద ఇళ్లు నిర్మించుకునే ప్రయత్నం చేసిన ఆటోడ్రైవర్లను ఆదివారం కొంత మంది అడ్డుకున్న విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్ల సమస్యను తెలుసుకున్న పలు ప్రజాసంఘాల నేతలు సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. ఆటోడ్రైవర్లకు కొంత మంది విరాళంగా అందజేసిన భూమిని కూడా కొంత మంది అగ్రవర్ణాల వారు ఆక్రమించుకునే ప్రయత్నం చేయడమే కాకుండా అటోడ్రైవర్లపై భౌతిక దాడికి యత్నించడం హేయకరమన్నారు. ఈ విషయంపై ఆటోడ్రైవర్లు ఫిర్యాదు చేసినా పీలేరు పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. న్యాయం జరిగే వరకు ఆటోడ్రైవర్లకు తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు తుమ్మల ధరణీకుమార్, సుభాశ్, ‘బాస్’ కార్యదర్శి పూలకుంట శ్రీనివాసులు, బీసీ సంఘ నేత మహేశ్ యాదవ్, గిరిజన సమాఖ్య నేత కిల్లా విజయ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటరామయ్య, బిస్మిల్లా ఆటోయూనియన్ నేతలు బోదేషా, రాజేంద్ర, షరీఫ్, వెంకటసుబ్బయ్య, ఖాదర్బాషా, రమణ, వెంకటేశ్, అమ్మాజీ, గుల్జార్, నాగరాజ, తదితరులు పాల్గొన్నారు.