మేము సైతం..

ABN , First Publish Date - 2021-03-05T06:47:16+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడానికి సంకల్పించడాన్ని పరోక్షంగా వైసీపీ... ప్రత్యక్షంగా పాలకేతర పార్టీలన్నీ నిరసిస్తున్నాయి.

మేము సైతం..

బీజేపీ మినహా నేటి బంద్‌కు రాజకీయ పార్టీల ప్రత్యక్ష, పరోక్ష మద్దతు

ప్రజా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కూడా

మధ్యాహ్నం వరకూ 

డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

నేడు విద్యాసంస్థల మూసివేత

అనంతపురం, మార్చి4(ఆంధ్రజ్యోతి) :  విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడానికి సంకల్పించడాన్ని పరోక్షంగా వైసీపీ... ప్రత్యక్షంగా పాలకేతర పార్టీలన్నీ నిరసిస్తున్నాయి. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మేము సైతమంటూ బంద్‌కు  సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర బంద్‌లో భాగంగా.... జిల్లా బంద్‌కు పరోక్షంగా వైసీపీ, ప్రత్యక్షంగా బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతునిస్తూ  భాగస్వాములవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంద్‌కు వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేసి ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి యువజన, మహిళా సంఘాలు, సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం ఈ బంద్‌లో భాగస్వాములై జయప్రదం చేయాలని ఆయా పార్టీల రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలను కోరారు. బంద్‌లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో జిల్లాలోని 900కుపైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. బంద్‌లో భాగంగా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు ఉన్నాయి. బంద్‌ సందర్భంగా జిల్లాలో విద్యాసంస్థలను(ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలు) మూసివేస్తున్నట్లు ఆ వర్గాలు ప్రకటించాయి. 

Updated Date - 2021-03-05T06:47:16+05:30 IST