ఏటీఎం కార్డులు తారుమారు చేసి మోసాలు
ABN , First Publish Date - 2021-07-25T05:14:12+05:30 IST
ఏటీఎం కార్డులను తారుమారు చేసి డబ్బులు కాజేస్తున్న మోసగాడిని రాచకొండ పోలీసు కమిషరేట్ పరిధిలోని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
భువనగిరి టౌన, జూలై24: ఏటీఎం కార్డులను తారుమారు చేసి డబ్బులు కాజేస్తున్న మోసగాడిని రాచకొండ పోలీసు కమిషరేట్ పరిధిలోని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి జోన డీసీపీ కె. నారాయణరెడ్డి శనివారం భువనగిరిలో విలేకరులకు వివరించారు. భువనగిరి పట్టణంలోని ఆర్బీనగర్కు చెందిన కొత్త కృష్ణ ఈ నెల 19న తన బ్యాంకు ఖాతా నుంచి నగదును వితడ్రా చేసేందుకు స్థానిక గంజ్లోని ఏటీఎంకు వెళ్లాడు. అతనికి ఏటీఎంపై అవగాహన లేదు. అక్కడే ఉన్న కరీంనగర్ జిల్లాకేంద్రానికి చెందిన తుమ్ము రాజు అలియాస్ రాజేందర్ను సాయమడిగాడు. కృష్ణ చెప్పిన పిన నెంబర్తో అతనికి రూ.5వేలు వితడ్రా చేసి ఇచ్చాడు. అప్పటికే తనవద్ద సిద్ధంగా ఉంచుకున్న ఫోర్జరీ ఏటీఎం కార్డును కృష్ణకు తిరిగిచ్చి అసలు కార్డును కాజేశాడు. అనంతరం అదేరోజు వివిధ ప్రాంతాల్లోని ఏటీఎం నుంచి కృష్ణ ఖాతాలోని రూ.24,450 వితడ్రా చేశాడు. మరుసటి రోజు బాధితుడు మరోమారు నగదు వితడ్రా కోసం ఏటీఎంకు వెళ్లడంతో బ్యాలెన్స చూసుకొని తాను మోసపోయానని గ్రహించాడు. అదే రోజు వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇనస్పెక్టర్ సుధాకర్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు రాజును ఈ నెల 23వ తేదీన భువనగిరిలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా మోసాలను ఒప్పుకున్నాడు. భువనగిరి టౌన, గజ్వేల్లో రెండు, జగిత్యాలలో ఏటీఎం కేంద్రాలుగా ఇదేతరహా మోసాలకు పాల్పడినట్టు తేలింది. అతని నుంచి రూ.1.30లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, 15 ఏటీఎంకార్డులు స్వాధీనం చేసుకున్నారు.