ఢిల్లీ పర్యటనలో సీఎం ఏం సాధించారు?: అచ్చెన్న
ABN , First Publish Date - 2020-10-27T20:36:12+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఏం సాధించారు..?
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఏం సాధించారు..? అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం గురించి మాట్లాడుతూ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఏపీ ప్రజల జీవనాడి పోలవరం. పోలవరం పూర్తయితే ఏపీ భవిష్యత్ బాగుంటుంది. చంద్రబాబుకు పేరొస్తుందని అమరావతిని జగన్ చంపేశారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం భవిష్యత్ను అంధకారం చేసింది. టీడీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 71 శాతం పైగా పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేశాం. రాజ్యసభ సాక్షిగా అంచనా వ్యయం రూ. 55 వేల కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అవగాహన లేని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్.. ఆ పర్యటనలతో ఏం సాధించారు?. కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా టీడీపీ ప్రభుత్వం 71 శాతం పూర్తి చేసింది. జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్లే పోలవరం ఆగిపోయింది’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.