అశోక్కి పట్టం
ABN , First Publish Date - 2021-05-03T06:57:03+05:30 IST
యానాం ఓటర్లు ఈసారి విలక్షణ తీర్పు ఇచ్చారు. యువకుడైన అశోకునికి పట్టం కట్టారు. 25 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా వున్న మల్లాడి కృష్ణారావును తిరస్కరించారు. ఆయన బలపరిచిన ఎన్టీయే అభ్యర్థి ఎన్.రంగసామిపై స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ విజయదుందుభి మోగించారు.
- యానాం ఎమ్మెల్యేగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయకేతనం
- రంగసామిపై 656 ఓట్ల మెజారిటీ
యానాం, మే 2: యానాం ఓటర్లు ఈసారి విలక్షణ తీర్పు ఇచ్చారు. యువకుడైన అశోకునికి పట్టం కట్టారు. 25 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా వున్న మల్లాడి కృష్ణారావును తిరస్కరించారు. ఆయన బలపరిచిన ఎన్టీయే అభ్యర్థి ఎన్.రంగసామిపై స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ విజయదుందుభి మోగించారు. ఆదివారం మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. తొలి రెండు రౌండ్లతో రంగసామి స్వల్ప ఆధిక్యత కనబరిచినప్పటికీ అనంతరం వెనుకబడ్డారు. ముడో రౌండు నుంచి పుంజుకున్న అశోక్ చివరి రౌండ్ ముగిసే సమయానికి 656 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని కంగుతినింపించారు. లెక్కింపు పూర్తయిన అనంతరం రిటర్నింగ్ అధికారి అమన శర్మ అశోక్ ఎమ్మెల్యే ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం అశోక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు... సుంకర కార్తీక్ (బీఎస్పీ)-90, ఎన్.రంగసామి (ఎన్ఆర్ కాంగ్రెస్)-16,477, పెద్దిరెడ్డి రమేష్బాబు (ఎంఎంకే)- 92, స్వతంత్ర అభ్యర్థులు గొల్లపల్లి శ్రీనివాస ఆశోక్-17132, మల్లాడి ఉదయలక్ష్మి-53, పెమ్మాడి దుర్గాప్రసాద్-95, గోలుగుల ప్రభావతి-13, నాటి బూరయ్య-21, గొల్లపల్లి భారతి-10, సబ్బతి లోకేశ్వరరావు-13, దవూలూరి వీర వ్రతపతి-320, కాళ్ల వెంకటరత్నం-25, టేకుమూడి వెంకట్రావు-210, సూరిమిల్లి సుబ్బారావు-102, తలాటం చంద్రశేఖర్రావు-139, నోటా-118.
ఈ విజయం నాన్నకు అంకితం
నాపై నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు ఇది యానాం ప్రజలు మా నాన్నకు ఇచ్చిన విజయం. దీనిని ఆయనకు అంకితం ఇస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నేరవేరుస్తాను.
...కౌంటింగ్ అనంతరం మీడియాతో అశోక్