దార్శనికుడు ఏఎస్రావు
ABN , First Publish Date - 2020-10-31T05:55:03+05:30 IST
అణుశాస్త్రవేత్త, దార్శనికుడు, ఈసీఐల్ వ్యవస్థాపకుడు, మోగల్లు ముద్దుబిడ్డ అయ్యగారి సాంబశివరావు 17వ వర్థంతి కార్యక్రమాన్ని శనివారం మోగల్లులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
నేడు స్వగ్రామం మోగల్లులో వర్ధంతి
పాలకోడేరు, అక్టోబరు 30: అణుశాస్త్రవేత్త, దార్శనికుడు, ఈసీఐల్ వ్యవస్థాపకుడు, మోగల్లు ముద్దుబిడ్డ అయ్యగారి సాంబశివరావు 17వ వర్థంతి కార్యక్రమాన్ని శనివారం మోగల్లులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయ్యగారి సాంబశివరావు 1914 సెప్టెంబరు 20న పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలోని సుందరమ్మ, వెంకటాచలం దంపతుల ఆఖరిబిడ్డగా జన్మించారు. 2003 అక్టోబరు 31న ఆయన పరమపదించారు. ఈయన మోగల్లులో ప్రాథమిక విద్య, తణుకులో ఉన్నతవిద్య, విజయనగరం మహారాజ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. బెనారస్ యూనివర్శిటీలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి అక్కడే అధ్యాపకునిగా పనిచేశారు. 1964లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి అణుశక్తి విభాగంలో శాస్త్రవేత్తగా చేరారు. 1953లో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ను స్థాపించారు. 1955లో అప్సర్ అణు రియాక్టర్ రూపకల్పనలో ప్రధానపాత్ర పోషించారు. దీంతో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ పార్లమెంట్లో అభినందనలు తెలిపారు.
ఏఎస్ రావు సేవలకు పద్మశ్రీ, పద్మవిభూషణ్
ప్రభుత్వం ఈసీఐఎల్ సంస్థను 1967లో స్థాపించగా దీనికి చైర్మన్గా సారాభాయ్ను ఎంపికచేసి బోర్డు డైరక్టర్గా, ఎండీగా ఏఎస్రావును ఎంపికచేశారు. ఈ సంస్థను అగ్రగామిగా నిలిపారు. చంద్రయాన్, మంగళయాన్కు ఈయన తయారుచేసిన పరికరాలు ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించారు. అలాగే ఎన్నో సంఘ సేవా కార్యక్రమాల్లో ఏఎస్రావు ముందుండే వారు. ఏఎస్రావు సేవలకుగాను 1990లో ప్రభుత్వం పద్మశ్రీ, 1972లో పద్మవిభూషణ్ అవార్డులు అందించారు. 1969లో డాక్టర్ నాయుడమ్మ స్మారక బంగారుపతకాన్ని పొందారు. హైదరాబాద్లో ఏఎస్రావు నగర్కూడా ఉంది.