12 హైకోర్టుల న్యాయమూర్తులుగా.. 68 మంది

ABN , First Publish Date - 2021-09-04T07:28:55+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

12 హైకోర్టుల న్యాయమూర్తులుగా.. 68 మంది

  • ఒకేసారి సుప్రీం కొలీజియం సిఫారసు.. మరో చరిత్రాత్మక నిర్ణయం
  • జాబితాలో 10 మంది మహిళల పేర్లు
  • గిరిజన మహిళకు తొలిసారి అవకాశం
  • గువాహటి హైకోర్టు జడ్జిగా వంకుంగ్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఒకేసారి ఎంపిక చేసింది. ఈ ఏడాది ఆగస్టు 25న, ఈ నెల 1న జరిగిన సమావేశాల్లో 112 మంది అభ్యర్థుల పేర్లను కొలీజియం పరిశీలించింది. వీరిలో బార్‌ నుంచి 82 మంది, జ్యుడీషియల్‌ సర్వీస్‌ నుంచి 31 మంది పేర్లపై చర్చించి.. చివరకు 68 మందిని ఎంపిక చేసింది. ఈ 68 మందిలో 44 మంది బార్‌ నుంచి, 24 మంది జ్యుడీషియల్‌ సర్వీస్‌ నుంచి ఉన్నారు. కొలీజియం ఎంపిక చేసిన వారిలో 10 మంది మహిళలు ఉండడం గమనార్హం. వీరిలో మిజోరం నుంచి షెడ్యూలు తెగకు చెందిన మహిళా న్యాయాధికారి మర్లీ వంకుంగ్‌కు జ్యుడీషియల్‌ సర్వీస్‌ నుంచి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేశారు. కొలీజియం సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే.. మిజోరం నుంచి హైకోర్టు జడ్జిగా నియమితులైన తొలి మహిళగా కూడా వంకుంగ్‌ రికార్డుల్లోకెక్కనున్నారు. కొలీజియం ఎంపిక చేసిన వారు అలహాబాద్‌, రాజస్థాన్‌, కలకత్తా, జార్ఘండ్‌, జమ్ము కశ్మీర్‌, మద్రాస్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హరియాణా, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, అసోం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఆగస్టు 17న తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులను, సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను ఎంపిక చేసిన తర్వాత మరోసారి ఇంత  పెద్దసంఖ్యలో నియామకాలు జరపడం ద్వారా జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ లతో కూడిన కొలీజియం మరోసారి సంచలనం సృష్టించినట్లయింది.

Updated Date - 2021-09-04T07:28:55+05:30 IST