దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్టు
ABN , First Publish Date - 2021-10-29T05:08:56+05:30 IST
దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్టు
- శంకర్పల్లి, భానూర్, తాండూర్, వికారాబాద్ రూట్లలో ప్రయాణికులే టార్గెట్
- నిందితులపై పీడీ యాక్ట్ పెడతాం : డీసీపీ
శంషాబాద్ రూరల్: శంకర్పల్లి, భానూర్, తాండూర్, వికారాబాద్ రూట్లలో అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ముఠాను శంకర్పల్లి పోలీసులు, ఎస్వోటీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో చేవెళ్ల డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ మహే్షగౌడ్తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రకా్షరెడ్డి వివరాలు వెల్లడించారు. యూపీలోని మీరుట్ ప్రాంతానికి చెందిన ఏ1 మహ్మద్ హర్షద్ (22) గత కొంత కాలంగా శంకర్పల్లిలో కార్పెంటర్గా పని చేస్తున్నాడు. ఏ2 జావేద్ చౌహాన్ (21) ట్రావెల్స్ బుకింగ్ సిబ్బందిగా పని చేస్తాడు. ఏ3 షారుక్ (21) ఎంబ్రాయిడరీ వర్క్, ఏ4 మహ్మద్ అఫ్జల్ (18) వంట మాస్టర్గా, ఏ5 అక్మల్ చౌహాన్ (18) రోటీ మాస్టర్గా పని చేస్తారు. ఏ6 మహ్మద్ ఫైజాన్(18)లు ముఠా సభ్యులు. కాగా వీరంతా ఈ నెల 14న బెంగుళూర్లో పని కోసం వెళ్లారు. అక్కడ పని నచ్చక పోవడంతో తిరిగి శంకర్పల్లి చేరుకున్నారు ఏ1 మహ్మద్ హర్షద్ ఇంట్లోనే వారంతా ఉన్నారు. అయితే వీరంతా కలిసి లగ్జరి జీవితం గడపాలని, అందుకోసం దారి దోపిడీలు చేయాలని పథకం పన్నారు. అనుకున్నదే తడువుగా, శంకర్పల్లిలో ఈ నెల 23న స్విఫ్ట్ డిజైర్ టీఎస్ 34ఎఫ్4969 కారును సలావుద్ధీన్ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకుని శంకరపల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో ఒకరి వద్ద సెల్ ఫోన్ చోరీ చేశారు. అదే రోజు భానూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో సెల్ ఫోన్, రూ.1000 దొంగతనం చేశారు. ఈ నెల 24న మహాలింగపురం గ్రామానికి చెందిన ఎన్.రవీందర్రెడ్డి బంధువుల విందుకు బైకుపైవెళ్లి అర్థరాత్రి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ముఠా సభ్యులు రవీందర్రెడ్డిని తాండూర్ ఎలా వెళ్లాలని అడిగి అతడిపై దాడిచేసి రూ.28 వేలు దోచుకెళ్లారు. బాధితుడు 25న శంకర్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోని దిగిన శంకర్పల్లి సీఐ మహే్షగౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ఎస్వోటీ సిబ్బంది నిఘాపెట్టి 28న నిందితులు టీఎస్ 07 జీజడ్0220 కారులో ఫతేపూర్ నుంచి శంకర్పల్లి వస్తుండగా అరెస్టు చేసి వారి నుంచి కత్తులు, ఇనుప రాడ్లు, రివాల్వర్, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ప్రకా్షరెడ్డి తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులకు నగదు రివార్డు ఇవ్వనున్నట్లు డీసీపీ తెలిపారు.