ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-10-19T05:44:02+05:30 IST
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
- రైతులకు ఇబ్బంది లేకుండా టోకెన్ల జారీ
- జిల్లాలో 263 కేంద్రాలు
- ఈ వారంలోనే ప్రారంభం
- కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత వానాకాలం సీజన్లో 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు, ప్రస్తుత సీజన్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1960, సాధారణ రకం క్వింటాల్కు రూ.1940 చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించిదన్నారు. రైతులకు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు లేకుండా జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక కొనుగోలు కేంద్రం ఉండే విధంగా 263 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల వివరాల నివేదికలు సమర్పించాలని, వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు టోకెన్ల జారీ చేసేలా చూడాలని వ్యవసాయాధికారిని, కొనుగోలు ప్రారంభానికి ముందే అవసరమైన మ్యాశ్చరైజ్ మీటర్లు, ఎలక్ర్టానిక్ తూకం యంత్రాలు, టార్పాలిన్లు వంటివి అందుబాటులో ఉంచాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. ధాన్యం సేకరణలో కోటి గన్నీ సంచులు అవసరం అవుతాయని కొనుగోలు ఆరంభానికి ముందే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గన్నీ సంచులు సేకరించి పెట్టుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ను, ధాన్యం రవాణాకు సంబంధించి లారీల కొరత లేకుండా కాంట్రాక్టులతో ఒప్పందాలు చేసుకోవాలని జిల్లా మేనేజర్ జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, డీసీఎస్వో జితేందర్రెడ్డి, డీఎం హరికృష్ణ, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీఎవో రణధీర్రెడ్డి, డీసీవో బుద్ధనాయుడు, డీటీవో కొండల్రావు, డీఎంవో ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.