ఏఆర్‌ కానిస్టేబుల్‌ వీరంగం

ABN , First Publish Date - 2021-01-16T05:46:41+05:30 IST

పాన్‌షాప్‌ నిర్వహిస్తున్న ఓ మహిళపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ దౌర్జన్యం చేయడంతోపాటు అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు

ఏఆర్‌ కానిస్టేబుల్‌ వీరంగం
పాన్‌షాప్‌ నిర్వాహకురాలికి నష్టపరిహారం అందజేస్తున్న సౌత్‌ ఏసీపీ

పాన్‌షాప్‌ నిర్వాహకురాలిపై దౌర్జన్యం

క్షమాపణ చెప్పించిన అధికారులు

ఉక్కుటౌన్‌షిప్‌: పాన్‌షాప్‌ నిర్వహిస్తున్న ఓ మహిళపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ దౌర్జన్యం చేయడంతోపాటు అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో జోక్యం చేసుకుని, మహిళకు నష్టపరిహారం అందజేశారు.  టౌన్‌షిప్‌ సెక్టార్‌-6లో అద్దంకి లక్ష్మి అనే మహిళ పాన్‌షాప్‌ నిర్వహిస్తున్నది. గురువారం సాయంత్రం ఏఆర్‌ కానిస్టేబుల్‌ నరేంద్రబాబు, అతని స్నేహితుడు హేమంత్‌ వర్మ అక్కడకు వచ్చారు. సిగరెట్లు కొన్న తరువాత తాను డబ్బులు ఇచ్చానని తిరిగి చిల్లర ఇవ్వమని వారు, తనకు  డబ్బులు ఇవ్వలేదని ఆమె అనడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ పాన్‌షాప్‌కు చెందిన ఫ్రిజ్‌, కూల్‌డ్రింక్‌ బాటిళ్లను ధ్వంసం చేశాడు. దీనిపై పాన్‌షాప్‌ నిర్వాహకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన సౌత్‌ ఏసీపీ రామాంజనేయరెడ్డి, అడ్మినిస్ట్రేషన్‌ ఆర్‌ఐలు కానిస్టేబుల్‌ను పాన్‌షాప్‌ వద్దకు తీసుకువచ్చారు. కానిస్టేబుల్‌తో ఆమెకు క్షమాపణ చెప్పించారు. ఆమెకు రూ.ఐదు వేలు నష్టపరిహారం అందజేశారు. ఏడీసీపీ(అడ్మిన్‌) ఎం.రజని స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-16T05:46:41+05:30 IST