జలకళ
ABN , First Publish Date - 2022-08-14T05:00:42+05:30 IST
శామీర్పేట పెద్ద చెరువు నిండి అలుగుపారుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో వరి, మెట్ట పంటలు పండుతాయని రైతులు పేర్కొంటున్నారు.
- అలుగు పారుతున్న శామీర్పేట పెద్ద చెరువు
- 33 అడుగులకు చేరిన నీరు.. భారీగా నిల్వ
- పంటలకు భరోసా.. ఆనందంలో అన్నదాతలు
- చెరువు వద్ద గంగమ్మతల్లికి జలకుండ పూజలు
- నీటిని చూస్తూ సందడి చేస్తున్న సందర్శకులు
శామీర్పేట పెద్ద చెరువు నిండి అలుగుపారుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో వరి, మెట్ట పంటలు పండుతాయని రైతులు పేర్కొంటున్నారు. అలాగే భూగర్భ జలమట్టం పెరిగి చెరువు కింద వేసుకున్న బోర్లలోనూ నీరు సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. యాసంగి పంటలకు కూడా ఢోకా లేదని రైతులంటున్నారు. ఇదిలా ఉంటే హైవే పక్కనే ఉన్న పెద్ద చెరువును చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ప్రకృతి అందాలను, చెరువు నీటిని చూస్తూ మైమరిచి పోతున్నారు. నగరానికి చెరువులో ఉన్న శామీర్పేట పెద్ద చెరువు పర్యాటకంగానూ దినదినాభివృద్ధి చెందుతోంది.
శామీర్పేట, ఆగస్టు 13: ఈ సారి వానాకాలం మొదట్లోనే కురిసిన భారీ వర్షాలతో జల వనరుల్లోకి భారీగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని అన్నదాతలు ఎదురు చూస్తున్న శామీర్పేట పెద్ద చెరువు నిండి అలుగుపారుతోంది. గతంలో ఎన్నడూ వానకాలం మొదట్లో చెరువు ఇంత తొందరగా నిండలేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వానలకు చెరువులోకి భారీగా నీరు చేరి నిండు కుండలా మారింది. దీంతో ఆయకట్టు రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వానకాలం పంటలు చెరువు నీటితో పండుతాయి. వచ్చే ఎండ యాసంగిలో చెరువులో నీరు తగ్గినా చెరువు కింద వేసిన బోర్లలో నీటి మట్టం పెరిగి ఆ పంటకు కూడా ఢోకా లేదనే భరోసాలో రైతులు ఉన్నారు.
జిల్లాలోనే అతి పెద్ద చెరువు...
మేడ్చల్ జిల్లాలోనే శామీర్పేట పెద్ద చెరువు అతిపెద్దది. వందలాది ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. మొన్నటి వానలకు చెరువు నిండి అలుగు పారుతోంది. ఎగువ ప్రాంతాలైన మేడ్చల్, దుండికల్ ప్రాంతాల నుంచి వరద నీరు చేరింది. చెరువులో నీటి నిల్వను తెలిపే 7 గజాల గుండు మునిగిపోయింది. అంటే నీటి మట్టం పూర్తిస్థాయికి చేరిందన్నమాట! శామీర్పేట పెద్దచెరువు నిండి అలుగు పారుతుండటంతో కట్టమైసమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తుల ప్రభాకర్యాదవ్ అధ్వర్యంలో డైరెక్టర్లు, సర్పంచ్ బాలమణి, ఎంపీపీ ఎల్లూబాయి, వైస్ఎంపీపీ యెల్లు సుజాత, జడ్పీటీసీ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రజా ప్రతినిధులు కొన్ని రోజుల క్రితం గంగమ్మతల్లికి జలకుండ పూజలు చేశారు. ఆయకట్టు రైతులకు పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు ఆయకట్టుకు నీటి విడుదల చేశారు. శామీర్పేట పెద్ద చెరువు 2009, 2014లో చెరువు నిండి అలుగు పారగా, గత అక్టోబర్లో, ప్రస్తుతం చెరువు నిండి అలుగు పారుతోంది. శామీర్పేట పెద్ద చెరువు శిఖం (ఎఫ్టీఎల్) 1,200 ఎకరాలు ఉండగా చెరువు లోతు 33 ఫీట్ల వరకు ఉంటుంది. చెరువు నిండితే 2,600ఎకరాల మేర తరి, మరో 2,000 ఎకరాల మేర ఖుష్కిలో పంటలు సాగు అవుతాయి. చెరువు ఆయకట్టు కింద ఈ సారి 2వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు.
మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి
హైదరాబాద్-రామంగుండం రాజీవ్ రహదారిని ఆనుకొని ఉండే శామీర్పేట పెద్ద చెరువు పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి చెందుతోంది. కొన్నేళ్ల క్రితమే ఈ చెరువు వద్ద ప్రభుత్వం మినీ ట్యాంక్బండ్ను నిర్మించింది. హైవేకు ఆనుకొని నగరానికి 30కిలోమీటర్ల పరిధిలో ఉండడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో చెరువు వద్దకు వచ్చి ఉత్సాహంగా గడుపుతున్నారు. ప్రతీ శని, ఆదివారాల్లో వందలాది మంది పర్యాటకులు చెరువు వద్దకు వచ్చి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే హైవే వెంబడి వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు సైతం చెరువు వద్ద సేదతీరుతున్నారు. సందర్శకుల కోసం ప్రభుత్వం, మున్సిపాలిటీ ఇక్కడ కొన్ని సౌకర్యాలు కల్పించింది. చుట్టూ చెట్టుచేమలు, వాగులు, బ్రిడ్జితో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. చెరువులో భారీగా నీరు ఉండడంతో సందర్శకులు తరలివస్తున్నారు. యేటా జిల్లా పరిధి ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక ప్రతిమల నిమజ్జనాన్ని ఈ చెరువులో నిర్వహిస్తుండడంతో పెద్ద చెరువు మరింత ప్రాచూర్యం పొందింది.