నకిలీ బంగారం తాకట్టు కేసులో అప్రైజర్ అరెస్టు
ABN , First Publish Date - 2022-05-27T06:49:45+05:30 IST
మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.35 లక్షలు స్వాహా చేసిన కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్ను గురువారం అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు.
బంగారుపాళ్యం, మే 26: మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.35 లక్షలు స్వాహా చేసిన కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్ను గురువారం అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. యూనియన్ బ్యాంకులో అప్రైజర్గా పనిచేస్తున్న యువరాజ్ తనకు తెలిసిన ఖాతాదారులతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.35 లక్షలు వారి ద్వారా తీసుకున్నారు. గుర్తించిన బ్యాంకు మేనేజరు మునీంద్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రైజర్ యువరాజ్తో పాటు నకిలీ బంగారం తాకట్టు పెట్టిన మరో ఐదుగురు ఖాతాదారులపై బంగారుపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అప్రైజర్ యువరాజ్తో పాటు తవణంపల్లె యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న పార్థసారఽథి, పలమనేరు శాఖ బ్యాంకు అప్రైజర్ విష్ణులకు ఈ కేసులో ప్రమేయమున్నట్లు గుర్తించి ముగ్గురు అప్రైజర్లతో పాటు ఐదుగురు ఖాతాదారులపై కేసు నమోదు చేశారు.