ఏపీ పీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-10-24T11:20:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీఈ సెట్‌-2020) ఫలితాలు శుక్రవారం విశాఖపట్నంలో విడుదల చేశారు.

ఏపీ పీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల

జిల్లాలో 86 శాతం ఉత్తీర్ణత

ఎంఈ విభాగంలో పవన్‌కుమార్‌కు ఫస్ట్‌ ర్యాంకు


కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 23 : ఆంధ్రప్రదేశ్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీఈ సెట్‌-2020) ఫలితాలు శుక్రవారం విశాఖపట్నంలో విడుదల చేశారు. జిల్లాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (ఎంఈ) విభాగంలో సంజీవ్‌ పవన్‌కుమార్‌కు ఫస్ట్‌ ర్యాంకు లభించింది. టాప్‌టెన్‌లో ఐదు ర్యాంకులూ కడప జిల్లావాసులే సొంతం చేసుకున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మశీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించింది. జిల్లాలో 1679 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1387 మంది పరీక్షలకు హాజరు కాగా, 1204 మంది (86.81 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 


టాప్‌టెన్‌లో ఐదుగురు

ఏపీ పీజీఈ సెట్‌లో జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో టాప్‌టెన్‌లో నిలిచారు. ప్రొద్దుటూరుకు చెందిన పవన్‌కుమార్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలో జమ్మలమడుగుకు చెందిన గాలిపోతు రంజిత్‌ 75 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు, పులివెందులకు చెందిన తమ్మిశెట్టి శ్రీలత 65 మార్కులు సాధించి తొమ్మిదో ర్యాంకు పొందారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ విభాగంలో రాజంపేటకు చెందిన జ్యోత్స్న 70 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సొంతం చేసుకుంది. మెటలార్జీ విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన దివ్యస్రవంతి 62 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు పొందింది.

Updated Date - 2020-10-24T11:20:14+05:30 IST