ఉద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వమే కారణం
ABN , First Publish Date - 2021-12-09T03:40:45+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు పెంచలరావు పేర్కొన్నారు.
ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు పెంచలరావు
కావలిటౌన్, డిసెంబరు 8: రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు పెంచలరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట జేఏసీ డివిజన్ అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడీజలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెంచలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ, తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 42 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ పీఆర్సీ నివేదిక బయటికి రాలేదన్నారు. 7 రెగ్యులర్ డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జీఎల్ఐలో దాచుకున్న రూ.1,600 కోట్లు ప్రభుత్వం వద్ద ఉంచుకుందన్నారు. ఉద్యోగుల కుటుంబ అత్యవసర పరిస్థితుల్లో రుణాలు పెట్టుకుంటే బిల్లులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరి గతంలో ఏ ప్రభుత్వం అవలంబించలేదన్నారు. ఉపాధ్యాయులు హెచ్ఎంలుగా పదోన్నతి పొందకుండానే రిటైర్ అయిపోతున్నారన్నారు. సీపీఎస్ రద్దు గాలిలో కలిసిపోయిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 ఏళ్ల నుంచి కన్సాలిడేట్ పే కింద పనిచేస్తు మగ్గిపోతున్నారన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, ఫ్యాప్టో నాయకులు కంచర్ల మధు, మాధవ, పువ్వాడి వెంకటేశ్వర్లు, చలపతిశర్మ, ఏపీజేఏసీ-అమరావతి కార్యదర్శి చెంచురామయ్య, రెవెన్యూ నాయకులు నరసారెడ్డి, పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు రమణయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.