జగన్‌ సర్కార్‌పై హైకోర్టు అసహనం

ABN , First Publish Date - 2021-04-22T18:15:53+05:30 IST

కోవిడ్‌ నియంత్రణ చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయకపోవటం పట్ల ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

జగన్‌ సర్కార్‌పై హైకోర్టు అసహనం

అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయకపోవటం పట్ల ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈనెల 26లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తోట సురేష్‌ బాబు దాఖలు  చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రాధాన్యతా అంశాన్ని పట్టించుకోకపోవటంపై ప్రశ్నించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు తదితరం అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రవేటు ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని పేర్కొంది. మరోవైపు రెమిడీ ఫీవర్‌ ఇంజక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని శ్రీనివాస్ చెప్పారు. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 27లోపు అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే ప్రభుత్వంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. 

Updated Date - 2021-04-22T18:15:53+05:30 IST