నేటి నుంచి ఏపీ రైతు సంఘం మహాసభలు
ABN , First Publish Date - 2022-05-28T06:16:40+05:30 IST
ఏపీ రైతుసంఘం రాష్ట్ర 22వ మహాసభలు శనివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు అనంతపురంలో జరగనున్నాయి.
అనంతపురం కల్చరల్, మే 27: ఏపీ రైతుసంఘం రాష్ట్ర 22వ మహాసభలు శనివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు అనంతపురంలో జరగనున్నాయి. నగరంలోని ఎస్జేఆర్ కల్యాణమండపంలో సభలను నిర్వహించను న్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవనున్నారు. గడిచిన మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకోవడంతోపాటు భవిష్యత కార్యాచరణను రూపొందించనున్నారు. ఢిల్లీలో ఏడాదిపాటు జరిగిన రైతు ఉద్యమం విజయవంతమయ్యాక రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రైతు సంఘం మహాసభల పట్ల అన్నివర్గాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మహాసభల నేపథ్యంలో గత పదిరోజులుగా నగరంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటో ఎగ్జిబిషన వంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలోనూ మహాసభలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కార్యక్రమాల వివరాలిలా..
మహాసభల్లో మొదటిరోజున ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు క్లాక్టవర్ కూడలి నుంచి సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు రైతు ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ బహిరంగసభ నిర్వహించనున్నారు. సభకు ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూకృష్ణన, ఏపీ రైతుసంఘం రాష్ట్ర పూర్వకార్యదర్శి శ్రీనివాసరావు, అధ్యక్షుడు కేశవరావు, కార్యదర్శి సూర్యనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు. రెండోరోజున ఆదివారం ఎస్జేఆర్ కల్యాణమండపంలో వ్యవసాయ సమస్యలు - ఐక్య ఉద్యమాలు - ఆవశ్యకత అనే అంశంపై సదస్సు జరగనుంది. మూడోరోజు సోమవారం రైతుసంఘాల సందేహాలు, చర్చలు, తీర్మానాలు చేయడంతోపాటు భవిష్యత కార్యాచరణ ప్రకటించనున్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నికతో మహాసభలు పూర్తవనున్నాయి.