తలుపులు మూసి.. మైకులు ఆపి ఏపీని చీల్చారు

ABN , First Publish Date - 2022-02-09T08:43:54+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అత్యంత సిగ్గుచేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు....

తలుపులు మూసి.. మైకులు ఆపి ఏపీని చీల్చారు

చర్చే జరగకుండా రాష్ట్ర విభజన

సిగ్గుపడేలా కాంగ్రెస్‌ వ్యవహారం

ఆంధ్ర, తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ విద్వేషాలు

వీటితో రెండు రాష్ట్రాలకూ నష్టం జరుగుతోంది

ఎన్టీఆర్‌నూ అన్యాయంగా గద్దె దించారు

రాష్ట్రపతి పాలనతో ప్రభుత్వాలను కూల్చారు

విమానాశ్రయంలో ఏర్పాట్లు సరిగా లేవని..

అంజయ్యను పదవి నుంచి తొలగించారు

కాంగ్రెస్‌ అధికారంలో లేకపోయి ఉంటే..

అనేక దారుణాలు జరిగి ఉండేవికావు

అర్బన్‌ నక్సలైట్ల మనస్తత్వంతో ఆలోచిస్తోంది

వారసత్వం తప్ప.. మరే విషయమూ పట్టదు

రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు

 చర్చే జరగకుండా రాష్ట్ర విభజన

 సిగ్గుపడేలా కాంగ్రెస్‌ వ్యవహారం: మోదీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అత్యంత సిగ్గుచేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్‌ దారుణంగా వ్యవహరించిందన్నారు. పార్లమెంటులో మైకులు బంద్‌ చేసి, పెప్పర్‌ స్ర్పేలు కొట్టి విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై ఎటువంటి చర్చా జరగలేదన్నారు. ‘కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇది ప్రజాస్వామ్యమా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించలేదని, కానీ.. ఏర్పాటు చేసే పద్ధతి అదేనా? అని నిలదీశారు. అందరితో మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చునని, కానీ.. అధికారంతో వచ్చిన అహంకారం తలకెక్కి క్రూరంగా వ్యవహరించారని ఆరోపించారు.


ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలున్నాయని, అవి రెండు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రె్‌సకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం లభించడంలేదన్న విషయం తమకు తెలుసునన్నారు. వాజ్‌పేయి హయాంలో బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, కానీ.. ఎలాంటి సమస్యా తలెత్తలేదని అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చారు. కాంగ్రె్‌సపై విమర్ళల దాడిని కొనసాగించారు. ప్రాంతీయ, కమ్యూనిస్టు ప్రభుత్వాలను కాంగ్రెస్‌ దౌర్జన్యంగా గద్దె దించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూడా కుప్పకూల్చిందన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ అస్వస్థతతో ఉన్నారని తెలిపారు. విమానాశ్రయంలో ప్రొటోకాల్‌ ఏర్పాట్లు సరిగా చేయలేదన్న చిన్న కారణంతో నాటి సీఎం టి.అంజయ్యను పదవి నుంచి తొలగించారని పరోక్షంగా ఇందిరాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌ వల్లే అనేక దారుణాలు..

కాంగ్రెస్‌ అధికార దాహంతో దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నులిమిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉంటే దేశంలో వారసత్వ రాజకీయాలు, సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్లపై అరాచకాలు జరిగేవి కావన్నారు. ఎమర్జన్సీ, కులాలు, ప్రాంతాల వారీగా దేశ విభజన జరిగి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్‌ లేకపోతే భారతదేశం మనోభావాల ఆధారంగా  నిర్ణయాలు జరిగి ఉండేవని, విదేశీ ధృక్పథం లేకపోయేదని తెలిపారు. కాంగ్రెస్‌ ఆలోచనల్ని, సిద్ధాంతాన్ని అర్బన్‌ నక్సలైట్లు ప్రభావితం చేస్తున్నారని, అందుకే వారు ప్రతిదానినీ వ్యతిరేక దృష్టితో చూస్తున్నారని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ అర్బన్‌ నక్సలైట్ల మనస్తత్వంతో ఆలోచిస్తున్నందునే చరిత్రను మేము తిరగ రాస్తున్నామంటున్నారు. కానీ, మేము చరిత్రను మార్చడంలేదు. ప్రజల జ్ఞాపకాలను తాజా చేస్తున్నాం. చరిత్రను కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాం. చరిత్ర అంటే అదే. కానీ, కొందరికి చరిత్ర అంటే ఒక కుటుంబం మాత్రమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘జాతి అన్న భావననే వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ భావన రాజ్యాంగ వ్యతిరేకమైతే.. మీ పార్టీని భారత జాతీయ కాంగ్రె్‌సగా ఎందుకు పిలుచుకుంటున్నారు? ఫెడరేషన్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌గా మార్చుకోవాలి’’ అని మోదీ సూచించారు. 


కరోనాపై విజయం..

130 కోట్ల మంది భారతీయుల క్రమశిక్షణ, పట్టుదల వల్ల కరోనాపై విజయం సాధించామని మోదీ అన్నారు. ప్రతిపక్షం దీన్ని కూడా రాజకీయం చేసిందన్నారు. జాతీయ అభివృద్ధికి, ప్రాంతీయ ఆకాంక్షలకు తాము ఎక్కడా వైరుధ్యాలు చూడమని మోదీ స్పష్టం చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరిస్తూ దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నప్పుడే దేశం బలంగా మారుతుందన్నారు. రాష్ట్రాలు బలపడితే దేశం కూడా బలపడుతుందన్నారు. దేశం అభివృద్ధి చెందే అమృతఘడియలు సమీపించాయని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 


గోవా ప్రజలకు నెహ్రూ అన్యాయం 

స్వాతంత్య్రం వచ్చాక 15 ఏళ్ల వరకు గోవా.. పోర్చుగీసు అధీనంలో ఉండేదని ప్రధాని మోదీ తెలిపారు. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తప్పిదాల వల్లే విముక్తి లభించలేదన్నారు. ప్రపంచమంతా తనను శాంతి కాముకుడిగా భావించాలన్న ఉద్దేశంతోనే గోవా ప్రజలకు నెహ్రూ అన్యాయం చేశారని ఆరోపించారు. ఎర్రకోటపై నుంచి గోవా ప్రజలకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రకటన చేశారని, అక్కడికి సైన్యాన్ని పంపబోమన్నారని గుర్తు చేశారు. గోవాలో జన్మించిన లతా మంగేష్కర్‌ సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ ఆకాశవాణిలో వీరసావర్కర్‌పై కవితా గానం చేసినందువల్లే ఆయనను తొలగించారని తెలిపారు. 

Updated Date - 2022-02-09T08:43:54+05:30 IST