విషం చిమ్మితే.. అమ్మవారు ఆగ్రహం
ABN , First Publish Date - 2020-10-22T10:32:25+05:30 IST
విషం చిమ్మితే.. అమ్మవారు ఆగ్రహం
309వ రోజు దుర్గమ్మకు పూజల్లో రైతులు
ఉద్దండ్రాయునిపాలేనికి నేడు మహా పాదయాత్ర
తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, అక్టోబరు 21: అమరావతి మీద కుట్రలు చేసి విషం చిమ్మితే దుర్గమ్మ సహించదని, ఆగ్రహం చెందుతోందని రాజధాని మహిళలు తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 309వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతిని రక్షించాలని కోరుతూ ఆయా శిబిరాల్లో దుర్గామాతకు పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికార పార్టీ మూడు రాజధానులకు మద్దతు అంటూ ఏర్పాటు చేసిన నిరసన శిబిరాల్లో పెయిడ్ ఆర్టిస్టులున్నారో, రైతు శిబిరాల్లో ఉన్నారో ప్రజలందరికీ తెలుసున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల వైపు ధర్మం, న్యాయం ఉందన్నారు. ప్రజల కోరిక ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు. రాజధాని ఉద్యమంలో దళితులు ముందున్నారని దళిత జేఏసీ కన్వీనర్ మార్టిన్ తెలిపారు.
- తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు బుధవారంతో 309వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరావతే ఆరు కోట్ల ఆంధ్రుల ఆరాధ్య రాజధాని అని తెలిపారు.
- అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో చేపట్టిన దీక్షలు 309వ రోజుకు చేరాయి.
- రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లోని రైతులు, మహిళలు బుధవారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఆ ప్రదేశాన్ని పరిశుభ్రం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డకోవడం దుర్మార్గమన్నారు.