‘అనురాగ్’లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలి
ABN , First Publish Date - 2020-10-01T09:25:53+05:30 IST
అధిక ఫీజులు వసూలు చేస్తున్న అనురాగ్ యూనివర్సిటీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువ విద్యార్థిలోకం విద్యార్థి
తెలంగాణ యువవిద్యార్థి లోకం నాయకులు
యూనివర్సిటీ ఎదుట ఆందోళన
ఘట్కేసర్ రూరల్ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న అనురాగ్ యూనివర్సిటీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువ విద్యార్థిలోకం విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ గేటు ఎదుట బుధవారం విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఒకేరోజు రెండు మిడ్ పరీక్షలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. కొవిడ్-19 నిబంధనలు పాటించకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. విద్యార్థులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు కల్పించకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ధన దోపిడీకి అలవాటుపడి అనురాగ్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తుందని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పరీక్షలను వాయిదా వేయాలని, ఫీజులను నియంత్రించకుంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు అశోక్ రాథోడ్, మహేష్, రాజు, విజయ్, దశరథ, వినోద్, విష్ణు, రవి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి సంఘం నాయకులు చేసిన ఆరోపణలు అవాస్తవమని, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పరీక్షలు నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో 12 మంది విద్యార్థులతోనే పరీక్షలు రాయిస్తున్నామన్నారు.