టోల్ వసూల్
ABN , First Publish Date - 2021-01-14T05:39:26+05:30 IST
టోల్ వసూల్
హనుమాన్ జంక్షన్-విస్సన్నపేట రోడ్డులో టోల్ వసూలుకు ప్రతిపాదనలు
మరో మూడు రహదారుల్లో కూడా..
విజయవాడ, ఆంధ్రజ్యోతి : హనుమాన్ జంక్షన్-విస్సన్నపేట రాష్ట్ర రహదారిపై టోల్ వసూలు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. జిల్లాలో మొత్తం నాలుగు రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు చేయడానికి ప్రతిపాదించారు. ఈ నాలుగు రహదారులను ప్రస్తుతం విస్తరించనున్నారు. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధులతో రెండు వరుసలుగా విస్తరించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు. గన్నవరం-ఆగిరిపల్లి-నూజివీడు రోడ్డును కూడా రెండు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రోడ్లలో టోల్ వసూలు చేయడానికి ప్రతిపాదనలు వెళ్లాయి. మిగిలిన మూడు రోడ్లు ఏమిటన్నది తెలియాల్సి ఉంది. తొలిదశలో టోల్ వసూలు చేయాలనుకుంటున్న వాటిలో హనుమాన్ జంక్షన్- విస్సన్నపేట రోడ్డు ప్రధానమైనది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను ఇది అనుసంధానిస్తుంది. 16వ నెంబర్ జాతీయ రహదారి, 222వ జాతీయ రహదారి (విజయవాడ-జగదల్పూర్)ని కలుపుతుంది. జంక్షన్ నుంచి నూజివీడు, నూజివీడు నుంచి విస్సన్నపేటకు కలుస్తుంది. అయితే, రాష్ట్ర రహదారులపై టోల్ వద్దని లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.