అన్నగారు దిద్దిన పురం

ABN , First Publish Date - 2022-05-28T05:50:17+05:30 IST

సినీరంగం, రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన మహానాయకుడు నందమూరి తారకరామారావు.

అన్నగారు దిద్దిన పురం

హిందూపురంతో ఎన్టీఆర్‌కు విడదీయరాని బంధం 

నేడు జయంతి వేడుకలకు ఏర్పాట్లు

హిందూపురం టౌన, మే 27: సినీరంగం, రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన మహానాయకుడు నందమూరి తారకరామారావు. అలాంటి ఆయన జన్మించింది ప్రస్తుత ఎన్టీఆర్‌ జిల్లాలో అయినా.. పురంతో విడదీయరాని బంధం అల్లుకుంది. ఆయన ఇక్కడి నుంచే మూడుసార్లు పోటీచేసి, తిరుగులేని విజయం సాధించారు. రెండుమార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆయన హిందూపురాన్ని సొంత ఊరిగా చెప్పుకునేవారు. పురాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. వెనుకబడిన నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భావించారు. లేపాక్షిలో నవోదయ, ఏపీఆర్‌ఎస్‌, మలుగూరు, కొడిగెనహళ్లిలో ఏపీఆర్‌ఎస్‌ పాఠశాలలను స్థాపించి, నిరుపేదలకు ఉన్నత విద్యనందించి ఎంతో మందిని మహాశిఖరాలకు చేర్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. హిందూపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో తూమకుంట పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. భారీ పారిశ్రామిక వాడగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంజీఎం క్రీడా మైదానంలో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆరే. హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చి, స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉండాలనే సంకల్పంతో ప్రత్యేక జీఓను తీసుకొచ్చారంటే పురంపై ఎంత మక్కువ ఉందో అర్థమవుతోంది.  నియోజకవర్గంలో గూడులేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మింపజేసి మారుమూల గ్రామాలకు సైతం రోడ్లను విస్తరించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ కుంటుపడుతుందోనని ఐఏఎస్‌ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన తరువాత కుటుంబికులు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-05-28T05:50:17+05:30 IST