పార్టీ కోసం ఆయన ఎంతో చేశారు: మాజీ మంత్రి అనిల్
ABN , First Publish Date - 2022-04-12T19:47:51+05:30 IST
సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సమన్వయకర్త అని, పార్టీ కోసం ఆయన ఎంతో చేశారని అనిల్ కుమార్ అన్నారు.
నెల్లూరు: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సమన్వయకర్త అని, పార్టీ కోసం ఆయన ఎంతో చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియోజకవర్గంలోకి ఆహ్వానిస్తానన్నారు. కుటుంబంలో గొడవలుంటే కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి తనకు ఇచ్చిన గౌరవంలో తాను రెండింతలుగా గౌరవిస్తానన్నారు. ప్రమాణస్వీకారానికి మంత్రి కాకాణి తనకు ఆహ్వానం పంపలేదన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తానే హీరో అని చెప్పుకుంటున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆ పార్టీ 30 లేదా 40 సీట్లకు పోటీ చేస్తుందని, ఎమ్మెల్యేగా టీడీపీ, జనసేనతో పోరాటం కొనసాగిస్తానన్నారు. నెల్లూరు పెన్నా బ్యారేజీని వచ్చే నెలలోనే ప్రారంభిస్తామన్నారు. సంగం బ్యారేజీ, పోలవరం విషయం తనది కాదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.