ఈడీకి ఐదోసారి ముఖం చాటేసిన మాజీ హోం మంత్రి
ABN , First Publish Date - 2021-08-18T20:33:57+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మరోసారి..
ముంబై: మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ముఖం చాటేశారు. తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇప్పటికి ఆయనకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. బుధవారంనాడు ఈడీ ముందు ఆయన హాజరుకావాల్సి ఉండగా, ఆయన తరఫున దేశ్ముఖ్ లాయర్ ఇంద్రపాల్ సింగ్ తిరిగి ఈడీ మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేశారు. బెల్లార్డ్ ఎస్టేట్లోని ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో ఇంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ, ఈడీ ఇన్వెస్టిగేషన్కు అనిల్ దేశ్ముఖ్ హాజరుకావడం లేదని, మినహాయింపు కోరుతూ ఇవాళ ఈడీకి దరఖాస్తు చేశామని చెప్పారు. సీఆర్పీఎఫ్ కింద ఉపశమన చర్యలు ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు తమకు స్వేచ్ఛ ఇచ్చిందని, త్వరలోనే తాము సంబంధిత కోర్టుకు వెళ్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ముందు తమ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉందని, అలాంటప్పుడు ఈడీ తమకు సమన్లు పంపడం ఏమిటని ప్రశ్నించారు. ఈడీకి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే తెలియజేసినందున దానికి కట్టుబడి ఉంటామని ఇంద్రపాల్ సింగ్ చెప్పారు. అనిల్ దేశ్ముఖ్కు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు సుప్రీంకోర్టు ఇటీవల నిరాకరిస్తూ, తగిన కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది.