ఇక వరసిద్ధుడి ఆలయంలో బ్రేక్ దర్శనాలు
ABN , First Publish Date - 2022-09-27T07:33:51+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఇకపై బ్రేక్ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురే్షబాబు తెలిపారు.
ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనం
పాలక మండలి సమావేశంలో తీర్మానం
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 26: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఇకపై బ్రేక్ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురే్షబాబు తెలిపారు.బ్రేక్ దర్శనానికి దేవదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే టికెట్ ధరను నిర్ణయిస్తామన్నారు. కాణిపాక ఆలయ సమావేశ మందిరంలో సోమవారం చైర్మన్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో సభ్యు లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని వీరు మీడియాకు వెల్లడించారు. ఆలయాన్ని ఉదయం 5 గంటలకు తెరచినప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు నిరంతర దర్శనాన్ని కల్పించడానికి కృషి చేస్తామన్నారు. నూతన ఆలయ నిర్మాణంతో అంతరాలయం, ముఖ మండప ఏర్పాటు చేయడం వల్ల స్వామికి అభిషేక సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. ఆలయంలో నిర్వహించే షట్కాల పూజ ను యథావిధిగా నిర్వహించడానికి బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారన్నారు. వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తుల సంఖ్య, ఆదాయం గత రెండేళ్లకంటే రెట్టింపు అయిందన్నారు. నూతన ఆలయ మహాకుంభాభిషేకం, వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, ఉభయదారులు, భక్తులకు పాలక మండలి ధన్యవాదాలు తెలిపింది. ఈ సమావేశంలో ఈఈ వెంకటనారాయణ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనరు కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, పాలక మండలి సభ్యులు గోవర్ధన్, మారుతీశ్వరరావు,కొండయ్య, సుశీల, కాంతమ్మ, సుబ్బలక్ష్మమ్మ, ప్రతిమ, వెంకటరమణమ్మ, ఎక్స్అఫిషియో మెంబరు సోమశేఖర్గురుకుల్, సూపరింటెంటెంట్లు శ్రీధర్బాబు, కోదండపాణి, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.