పెళ్లి రోజే.. డెత్ డే అయ్యింది.. బిడ్డనైనా బాగా చూసుకోండంటూ సూసైడ్ నోట్ రాసి..
ABN , First Publish Date - 2020-07-03T17:55:20+05:30 IST
బతికుండగా తనను ఎలాగూ సరిగా చూసుకోలేదు....
సూసైడ్ నోట్ రాసి మహిళ ఆత్మహత్య
చిలమత్తూరు(అనంతపురం): బతికుండగా తనను ఎలాగూ సరిగా చూసుకోలేదు.... బిడ్డనైనా బాగా చూసుకోండి.. మన పెళ్లి రోజే.. డెత్ డే అయ్యింది.. నేను చనిపోతున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దేమకేతేపల్లికి చెందిన నాగేంద్రకు, చిత్తూరు జిల్లా పీటీఎం మండలం కేసేవారిపల్లికి చెందిన శిల్పకు 2013 సంవత్సరంలో వివాహమైంది.
కొన్నాళ్లు వారి దాంపత్యం అన్యోన్యంగా గడిచింది. ఇద్దరు బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు. వారికి నాలుగేళ్ల కుమారుడు హర్షవర్ధన్ ఉన్నాడు. అయితే ఆ తరువాత వారి ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉండటం ప్రారంభించారు. భర్త నాగేంద్ర బెంగళూరులో ఉండటంతో ఐదారు నెలలుగా శిల్ప దేమకేతేపల్లిలోనే ఒక ఇల్లు తీసుకొని ఒంటరిగా ఉంది. భర్త దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఫ్యానుకి చీరతో ఉరి వేసుకుంది.
ఆలస్యంగా గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని శిల్ప తల్లిదండ్రులకు చేరవేశారు. తన కూతురు ఆత్మహత్యకు కారణం ఆమె భర్త నాగేంద్ర, ఆమె అత్త గంగరత్నమ్మలు అని మృతురాలి తండ్రి శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్.ఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రంగనాయకులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.