బిహార్‌లో డిజిటల్ ర్యాలీ నిర్వహించనున్న అమిత్ షా

ABN , First Publish Date - 2020-06-07T14:42:07+05:30 IST

బిహార్‌లో సోమవారం కేంద్రమంత్రి అమిత్ షా నిర్వహించనున్న డిజిటల్ ర్యాలీ..

బిహార్‌లో డిజిటల్ ర్యాలీ నిర్వహించనున్న అమిత్ షా

న్యూఢిల్లీ: బిహార్‌లో సోమవారం కేంద్రమంత్రి అమిత్ షా నిర్వహించనున్న డిజిటల్ ర్యాలీ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నితీస్ కుమార్‌తో కలిసి మల్లీ పీఠాన్ని అధిరోహించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వమే బిహర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని పాశ్వాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


బిహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రజలనుద్దేశించి కేంద్రమంత్రి, పార్టీ సీనియర్ నేత అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్, ఫెస్ బుక్ లైవ్ ద్వారా ప్రసంగించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 243 అసెంబ్లీ స్థానాల్లోని లక్ష మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బిహార్‌లో మొదటి నుంచి బీజేపీకి వెన్ను దన్నుగా నిలుస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఈసారి కూడా కూటమిగా బరిలోకి దిగుతామంటోంది. వలస కూలీల విషయంలో నితీష్ పనితీరుపై బాహటంగానే పాశ్వాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 225కు పైగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలో కూర్చుంటామని ఎల్జీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా చేపడుతున్న డిజిటల్ ర్యాలీ ఎన్డీయే ఐక్యతను చాటి చెప్పేందుకేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బిహార్‌లో అమిత్ షా నిర్వహించనున్న వర్చువల్ ర్యాలీపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తం  కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే బీజేపీ ఎన్నికల కోసం తాపత్రయపడుతుండడం, రాజకీయ రాబందువాదమేనని అన్నారు. జనం చనిపోతున్నా బీజేపీకి పట్టడంలేదని, దానికి కావాల్సింది ఎన్నికల్లో విజయం సాధించడమేనని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 15 ఏళ్ల విభజిత, విఫల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే భావజాలం కలిగిన పేదల అనుకూల పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - 2020-06-07T14:42:07+05:30 IST