ఏపీ ఎన్నికల కమిషనర్‌కు వర్ల రామయ్య లేఖ

ABN , First Publish Date - 2021-01-23T15:27:10+05:30 IST

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.

ఏపీ ఎన్నికల కమిషనర్‌కు వర్ల రామయ్య లేఖ

అమరావతి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. మార్చి 2020లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక, హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒక వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు సహకరించలేదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై అధికార వైసీపీ పార్టీ గూండాలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. సాధారణ ప్రజలను కూడా భయాందోళనలకు గురిచేశారని మండిపడ్డారు.


ఎన్నికల అధికారులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఒక ఓటర్ లిస్టు, అధికార పార్టీ ‌అభ్యర్థులకు మరో ఓటర్ లిస్టులు ఇచ్చి అనేక అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. గత ఎన్నికల్లో అధికార వైసీపీ గూండాలు ఎన్నికల్లో పాల్గొనాలనే ఆసక్తిగల అభ్యర్థుల నామినేషన్లు అడ్డగించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో నామినేషన్లను ఆన్‌లైన్‌లో సమర్పించేలా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అధికార వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్‌లను ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ వాలంటీర్‌లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని చెప్పారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నికల కోడ్‌ను యదేచ్ఛగా ఉల్లంఘించారన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై నేరాలు మోపి అనర్హులను చేయాలనే ఉద్దేశంతో నల్ల ఆర్డినెన్స్ నెం. 2 /2020 తీసుకొచ్చారని తెలిపారు. దానిని మరలా ఆగస్టు 4, 2020 డిజైన్స్ నెంబర్ 6ను తిరిగి పునరుద్ధరించారన్నారు.


అధికార వైసీపీ పార్టీ జెండా రంగుల అంశంలో గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలు కేంద్ర భద్రతా దళాలు సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే ప్రజలను, విధి నిర్వహణలో ఉన్న అధికారులను కరోనా బారి నుండి కాపాడేందుకు కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని చెప్పారు. ఎన్నికల అధికారులకు, విధులు నిర్వహించే సిబ్బందికి వారు పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్‌లో విధులు నియమించకుండా ఇతర డివిజన్లలో డ్యూటీలు వేయాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-23T15:27:10+05:30 IST