మూడు రాజధానులతో అఽధోగతి
ABN , First Publish Date - 2021-03-05T05:58:08+05:30 IST
మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
అమరావతి రాజధానిపై కుట్రలు ఆపాలి
443వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
తుళ్లూరు, తాడికొండ, మార్చి 4: మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంతవాసులు చేపట్టిన ఆందోళనలు గురువారం 443వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయా శిబిరాల్లో రైతులు, మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థిక వనరుగా మారుతుందన్నారు. రాజధాని అమరావతిని మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కమిటీలతో కాలయాపన తగదన్నారు. అమరావతి కోసం మోతడక గ్రామ రైతులు చేపట్టిన పాదయాత్ర గురువారం ప్రకాశం జిల్లా శింగరాయకొండకు చేరుకుంది. రాజధాని 29 గ్రామాల్లో నిరసనలు, ధర్నాలు కొనసగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. శిబిరాలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమం యధావిధిగా కొనసాగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్షలు కొనసాగాయి. ఐకాస నేతలు, స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.