పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు
ABN , First Publish Date - 2020-05-26T17:22:19+05:30 IST
మాయదారి మద్యం పచ్చని కుటుంబంలో చిచ్చు రేపింది. తాగుడు మానుకోవాలని..
తాగుడు మానని పెనిమిటి
మనస్తాపంతో భార్య ఆత్మహత్య
తట్టుకోలేక గొంతు కోసుకున్న భర్త
ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
శంకరాపురంలో విషాదం
ముండ్లమూరు(ప్రకాశం): మాయదారి మద్యం పచ్చని కుటుంబంలో చిచ్చు రేపింది. తాగుడు మానుకోవాలని భర్తను వేడుకున్నా అతనిలో మార్పు రాకపోవడంతో ఓ ఇల్లాలు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం తట్టుకోలేని భర్త కూడా గొంతు కోసుకొని చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మండలంలోని శంకరాపురంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
శంకరాపురం ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి నాగేశ్వరరావుకు 12 ఏళ్ల క్రితం యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి విజయ్ (12), అఖిల్(10) అనే ఇరువురు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దాన్ని మానివేయాలని రమాదేవి వేడుకుంటున్నా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసుగు చెందిన రమాదేవి (30) సోమవారం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందింది. ఇది తెలుసుకున్న నాగేశ్వరరావు కత్తితో తన గొంతు కోసుకున్నాడు. బంధువులు గమనించి చికిత్స నిమిత్తం అద్దంకిలో చేర్పించగా మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ చిన్నారుల రోదన చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఎస్సై కె. రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.