ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఎస్పీ
ABN , First Publish Date - 2022-02-08T22:31:00+05:30 IST
2012కు ముందు నేను పార్టీ మేనిఫెస్టో విడుదల చేశాను. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతకు ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిపై కమిటీలు వేసి రిపోర్ట్లు తీసుకుని అన్ని హామీలు నెరవేర్చాం..
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విడుదల చేశారు. మంగళవారం లఖ్నవూలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొంత మంది సీనియర్ నేతలతో కలిసి 88 పేజీల మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేష్.. 2025 నాటికి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రధానంగా చెప్పుకొచ్చారు.
‘‘2012కు ముందు నేను పార్టీ మేనిఫెస్టో విడుదల చేశాను. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అంతకు ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిపై కమిటీలు వేసి రిపోర్ట్లు తీసుకుని అన్ని హామీలు నెరవేర్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో కొన్ని హామీలు పేర్కొన్నాం. మా మేనిఫెస్టో పేరు ‘సత్య వచన్, అటూట్ వాదా’. ఇదే నినాదంతో మేం ప్రజల ముందుకు వెళ్తున్నాం. మేం అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోను కూడా పూర్తిగా అమలు చేస్తాం’’ అని అఖిలేష్ అన్నారు.